మహాత్మాగాంధి జాతీయ ఉపాధి హామీ పథకం(నరేగా) నిధులను సంపూర్ణంగా వినియోగించుకుని గ్రామాల్లో తెలంగాణకు హరితహారం, వైకుంఠధామాలు (స్మశానవాటికలు) నిర్మించాలని ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. నరేగా నిధులతో పాటు రాష్ట్ర బడ్జెట్ నిధులు, ఎంపి, ఎమ్మెల్యేల నియోజకవర్గ అభివృద్ధి నిధులు కూడా ఉపయోగించుకుని గ్రామాల్లో అభివృద్ధి చర్యలు చేపట్టాలని సిఎం చెప్పారు. నరేగా పథకం కింద కేంద్రం రాష్ట్రానికి ఎంత మొత్తంలో డబ్బులు ఇస్తుందో, అంతే మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా బడ్జెట్లో నిధులు కేటాయిస్తుందని, ఈ నిధులను గ్రామాల అభివృద్ధికి వినియోగించాలని చెప్పారు. గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలోనే నరేగా పనులు జరగాలని, హరితహారం పనులకు మొదటి ప్రాధాన్యం, స్మశాన వాటికల నిర్మాణానికి రెండో ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. నరేగా నిధులు గ్రామాల్లో ప్రజలకు ఉపయోగపడే ఆస్తులను సృష్టించడానికి ఉపయోగించాలని సూచించారు. అన్ని గ్రామ పంచాయతీలకు ఖచ్చితంగా బిటి రోడ్డు ఉండేలా రహదారుల వ్యవస్థను నిర్మించాలన్నారు. పంచాయతీ రాజ్ – గ్రామీణాభివృద్ధిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, ఎంపిలు బి.వినోద్ కుమార్, బండ ప్రకాశ్, ఎమ్మెల్యేలు ఈటల రాజెందర్, డి.ఎస్.రెడ్యానాయక్, బాల్క సుమన్, మాజీ ఎమ్మెల్యే మాలోతు కవిత, పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, కమిషనర్ నీతూ ప్రసాద్, అడిషనల్ పిసిసిఎఫ్ డోబ్రియాల్, సిఎంవో ప్రత్యేక కార్యదర్శులు స్మితా సభర్వాల్, భూపాల్ రెడ్డి, ఓఎస్డి ప్రియాంక వర్గీస్ తదితరులు పాల్గొన్నారు.
‘‘తెలంగాణకు హరితహారంలో భాగంగా రాష్ట్రంలోని మొత్తం 12,751 గ్రామాల్లో నర్సరీలు ఏర్పాటు చేయాలి. ప్రతీ గ్రామంలో మొక్కలు నాటి రక్షించాలి. వీటికి నరేగా నిధులను పూర్తిగా వినియోగించుకోవాలి. గుంతలు తవ్వడానికి, నీళ్లు పోయడానికి, ఇతరత్రా పనులకు ఈ నిధులు వాడాలి. అటవీశాఖ అధికారుల సలహాలు, సాంకేతిక సహకారంతో గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో నర్సరీలు ఏర్పాటు చేయాలి. మొక్కలు పెట్టడం, వాటిని రక్షించడం లాంటి బాధ్యతలు గ్రామ పంచాయతీలు చేపట్టాలి’’ అని ముఖ్యమంత్రి చెప్పారు.
‘‘రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ఖచ్చితంగా ఆరునెలల్లో వైకుంఠధామాలు నిర్మించాలి. ప్రభుత్వ భూమి లేకుంటే గ్రామ పంచాయతీలు తమ నిధులతో స్థలాలు సమకూర్చాలి. దాతల నుంచి స్వీకరించాలి. వైకుంఠధామం నరేగా నిధులతో నిర్మించాలి. 3వేల లోపు జనాభా కలిగిన 11,412 గ్రామాల్లో ఒకటి చొప్పున, 3వేలకు పైగా జనాభా కలిగిన 1300 గ్రామాల్లో రెండు చొప్పున మొత్తం 14,012 గ్రామాల్లో వైకుంఠధామాలు నిర్మించాలి’’ అని చెప్పారు.
‘‘గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడం గ్రామ పంచాయతీల బాధ్యత. శిథిలాలు తొలగించాలి. పాడుపడిన, వాడని బావులను పూడ్చేయాలి. మురికి చెట్లను తొలగించాలి. కూలిన ఇండ్ల శిథిలాలు తొలగించాలి’’ అని సిఎం చెప్పారు.
‘‘ రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలకు ఖచ్చితంగా బిటి రోడ్డు ఉండాలని ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంది. కొత్తగా 859 గ్రామాలకు రహదారులను నిర్మించాలి. వీటికోసం వెంటనే ప్రతిపాదనలు తయారు చేసి, పనులు ప్రారంభించాలి’’ అని సిఎం చెప్పారు.
నరేగాతో పాటు వివిధ రకాలుగా సమకూరిన నిధులతో గ్రామాల్లో జరుగుతున్న పనులను ఆకస్మికంగా తనిఖీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. నిధులు దుర్వినియోగం కావద్దని, ప్రతీ పైసా సద్వినియోగం కావాలని అన్నారు. పనులు నామమాత్రంగా చేసి, నిధులు కాజేసే పద్ధతి పోవాలన్నారు. దీనికోసం ప్రస్తుతం గ్రామాల్లో జరుగుతున్నపనులను అధికారులు 20 బృందాలుగా విడిపోయి ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలన్నారు .