సిరిసిల్ల ఏరియా ఆస్పత్రి డాక్టర్ల తీరుపై ఎమ్మెల్యే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ సిరిసిల్ల ఏరియా ఆసుపత్రిని కేటీఆర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో సమస్యలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. నిన్న వైద్యం అందక ఒక గర్భిణీ స్త్రీ చనిపోయిన ఘటనపై కేటీఆర్ డాక్టర్లను ప్రశ్నించారు. వైద్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. డాక్టర్ల తీరు ప్రభుత్వానికి తలవంపులు తెచ్చేదిగా ఉందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన వారిని మరోచోటకి వెళ్లమని చెప్పడం దారుణమన్నారు. ఏమీ లేనివాళ్లే ప్రభుత్వాస్పత్రికి వస్తున్నారని తెలిపారు. మరో చోటకు వెళ్లమని ఉచిత సలహాలు ఇవ్వొద్దని వైద్యులకు సూచించారు. ఇక్కడ పోస్టింగ్ వస్తే.. డిప్యూటేషన్పై మరో చోటకు వెళ్లడం సరికాదన్నారు. డాక్టర్లను తయారు చేసేందుకు రూ.లక్షలు ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు. డాక్టర్లు అందుబాటులో ఉండి స్థానికులకు సాయం చేయాలని కోరారు. త్వరలోనే సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి గైనకాలజి డాక్టర్ను రప్పిస్తామని చెప్పారు. ప్రభుత్వం మిమ్మల్ని డాక్టర్లుగా తయారు చేస్తే మూడేళ్లు జిల్లాలో పనిచేయలేరా? అని ప్రశ్నించారు. గైనకాలజిస్టు లేక గర్భిణీలను వెనక్కి పంపుతున్నారనే వార్తలపై ఉన్నతాధికారులతో కేటీఆర్ మాట్లాడారు. వైద్యశాఖ సెక్రటరీతో ఫోన్లో మాట్లాడి నలుగురు గైనకాలజిస్టులను నియమించాలని కోరారు.
ఆకస్మిక తనిఖీ సందర్భంగా ఆసుపత్రి అంతా కలియతిరిగిన కేటీఆర్ రోగులను పలకరించి, వారి ఆరోగ్య సమస్యల గురించి ఆరా తీశారు. . ఆసుపత్రిలో ఉన్న సమస్యల గురించి రోగుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాలింత స్త్రీలు కొంత మంది కేటీఆర్తో సెల్ఫీలు దిగి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
