తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం కొలువుల భర్తీ విషయంలో అసత్య ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం త్రిముఖ వ్యూహంతో ముందుకు వెళుతోందని తెలిపారు. లక్షా 12 వేల ఉద్యోగాల భర్తీకి కట్టుబడి ఉన్నామని సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారని గుర్తుచేశారు. ఇందులో భాగంగా ఇప్పటికే 27 వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. 63 వేలకు పైగా ఉద్యోగాల భర్తీ వివిధ దశల్లో ఉందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగాలు దాదాపుగా ప్రభుత్వం భర్తీ చేసిందన్నారు. కీలక విభాగాల్లో ఉద్యోగాల భర్తీ దశల వారీగా సాగుతోందని విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నాయని పల్లా రాజేశ్వర్ రెడ్డి వివరించారు. ప్రైవేట్ పరిశ్రమల స్థాపన ద్వారా చాలా ఉద్యోగాలు వచ్చాయని అయినప్పటికీ…కోదండ రాం దివాలాకోరు విధానంతో ఆరోపణలు చేస్తున్నారన్నారు. కోదండరాంది కొలువుల కొట్లాట కాదు ఆయన కొలువు కోసం కొట్లాట అని వ్యాఖ్యానించారు. కేంద్రంలో అధికారం లోకి వచ్చిన బీజేపీ ఎన్నికల సందర్భంగా కోటి ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి దాన్ని తుంగలో తొక్కిందని పేర్కొంటూ…మీ పోరాటం బీజేపీ మీద చేయకుండా ఆ పార్టీ సాయం తీసుకుంటారా? అని సూటిగా ప్రశ్నించారు. నిరుద్యోగ సమస్యను పెంచి పోషించిన కాంగ్రెస్ తో కోదండ రాం ఎలా కలిసి పనిచేస్తారని సూటిగా ప్రశ్నించారు.
ఇది నిజమైన నిరుద్యోగుల కొలువుల కొట్లాట కాదని ఎమ్మెల్సీ పల్లా తెలిపారు. కేవలం రాజకీయ నిరుద్యోగుల కోసం కోదండరాం నిర్వహిస్తున్న సభ అని ఎద్దేవా చేశారు. నిరుద్యోగులు సీఎం కేసీఆర్ పై పూర్తి విశ్వాసంతో ఉన్నారన్నారు. కోదండరాంతో వెళ్తున్న కొంత మంది నిరుద్యోగులు కూడా ప్రభుత్వ చిత్తశుద్ధిని త్వరలో అర్థం చేసుకుంటారని పేర్కొన్నారు. ఐదు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ కొందరు అజ్ఞానంతో మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. జాతీయ స్థాయిలో నిరుద్యోగ శాతం 3 ఉంటే రాష్ట్ర స్థాయిలో 2 శాతం ఉందన్నారు. 3 శాతం నిరుద్యోగం ఉన్న చోట కోదండరాం పోరాటం చేయకుండా 2 శాతం ఉన్న చోట కోదండరాం పోరాటం చేయడం కోదండ రాం దౌర్భాగ్యమన్నారు. రాజకీయ స్వార్థంతో కొందరు చేస్తున్న ప్రచారాన్ని నిరుద్యోగులు నమ్మొద్దని సూచించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని కేసీఆర్ ఎన్నడూ చెప్పలేదని…ఎవరైనా దమ్ము దైర్యం ఉంటే ఆ తప్పుడు ప్రచారంపై తమతో చర్చకు రావాలని సవాల్ విసిరారు.