ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. తాజాగా సాగునీటి ప్రాజెక్టులపై సభలో చర్చ జరగుతోంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షనేత చంద్రబాబుపై మంత్రి అనిల్ కుమార్ విమర్శలు గుప్పించారు. చంద్రబాబు.. తమరి అనుభవమంతా దోచుకోవడానికే పనిచేసిందని ఎద్దేవా చేశారు. మాజీముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో ఇరిగేషన్ శాఖలో భారీ ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు. రింగ్ గా మారి రాష్ట్రంలో ప్రాజెక్టుల పనులు పంచుకున్నారని అనిల్ అన్నారు. అదేవిధంగా రూ.16 వేలకోట్ల రేట్లు పెంచేశారని ఆరోపించారు. శిలాఫలకాల కోసమే కోట్లు ఖర్చు చేశారని ప్రాజెక్టు పూర్తి చేద్దామన్న ధ్యాస చంద్రబాబులో ఏమాత్రం లేదని మండిపడ్డారు. ఎక్కడా లేని విధంగా రివర్స్ టెండరింగ్ తెస్తున్నట్లు పేర్కొన్నారు. కాంట్రాక్టుల్లో పారదర్శకతకు జ్యూడిషియల్ కమిషన్ వేస్తున్నట్లు వివరించారు. ఇదిలా ఉండగా… అసెంబ్లీ సమావేశంలో సీట్ల కేటాయింపులో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య రగడ కొనసాగింది.