నల్లగొండ జిల్లా పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. పర్యటనలో భాగంగా చిట్యాలలో ఆరో విడుత హరితహారం కార్యక్రమంలో భాగంగా మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి మొక్కలు నాటి సబ్ స్టేషన్ ను ప్రారంభించారు. అలాగే మున్సిపాలిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ .. సంక్షోభంలో కూడా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయ్యం అన్నారు.
రైతులందరికి రైతుబంధు డబ్బులు అందించామని తెలిపారు. దీంతో రైతులు చాలా సంతోషంగా వానాకాలం సాగును ప్రారంభించారు. అందరకి ఆసరా పెన్షన్ లను అందజేస్తున్నామని పేర్కొన్నారు. నల్గొండ జిల్లాలో ఉన్న బ్రాహ్మణ వెళ్లంల ప్రాజెక్ట్ పనులను త్వరలోనే పూర్తి చేసి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభిస్తామని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలను అందంగా తీర్చిదిద్దుతున్నాం. లాక్ డౌన్ కారణంగా రాష్ట్ర ఆదాయం కొంత దెబ్బతిన్నది. అయినా కూడా వేగంగా పుంజుకుంటున్నామని మంత్రి తెలిపారు. నెల నెలా మున్సిపాలిటీలకు, పంచాయతీలకు ఇచ్చే నిధులను అందిస్తున్నామని తెలిపారు.
కార్యక్రమంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ నేతి విద్యాసాగర్, మండలి విప్ కర్నె ప్రభాకర్, జెడ్పీ చైర్మన్ నరేందర్ రెడ్డి, ఎంపీ లింగయ్య యాదవ్, స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, ఎమ్మెల్యేలు గాదరి కిషోర్ కుమార్, భాస్కర్ రావు, ఎమ్మెల్సీ తేరా చిన్నప రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వేమిరెడ్డి నరసింహా రెడ్డి పాల్గొన్నారు.