రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ క్రమంలో తన కార్యాచరణను వేగంగా ముందుకు తీసుకున్నారు. అభిమానుల కోసం ఓ వేదికను ఏర్పాటు చేసి ఫ్యాన్స్ ని ఒక్క దగ్గరికి చేర్చడంతో పాటు, వారి అభిప్రాయాలను తీసుకునేందుకు ఓ వెబ్ సైట్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీనికి కొనసాగింపుగా రజనీకాంత్ తాజాగా మీడియాతో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో రజనీకాంత్ మాట్లాడుతూ నేను రెండు నెలలపాటు కర్ణాటక మీడియాలో పనిచేశానని వెల్లడించారు. కానీ ప్రస్తుతం నాకు మీడియాను ఎలా హ్యాండిల్ చేయాలో తెలియడం లేదని వివరించారు. అయితే రాజకీయాలకు తాను కొత్త కాబట్టి…తనకు తెలియకుండా ఏదైనా తప్పు జరిగి ఉంటే క్షమించాలని రజనీకాంత్ కోరారు. మీడియా వల్లే తాను ఇంతవాడిని అయ్యానని తెలిపారు.
కాగా, రజనీ కాంత్ ఇటీవల అభిమానులతో సమావేశమై చివరి రోజు తన రాజకీయ ప్రవేశంపై ప్రకటన చేసిన విషయం తెలిసిందే. తన ఫ్యాన్స్ కోసం రజినీ మండ్రం డాట్ ఓఆర్జీ పేరుతో సైట్ ను ప్రారంభించినట్లు రజినీకాంత్ ప్రకటించారు. అభిమానులెవరైనా ఆ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవచ్చని, వారి ఓటర్ ఐడీ నెంబర్ వివరాలను కూడా వెల్లడించాల్సి ఉంటుందని రజినీ చెప్పారు. ఈ వెబ్ సైట్ ద్వారా ప్రజల అభిప్రాయాలను సేకరించి పొలిటికల్ ఎజెండాపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని అభిమానులకు చేరవేయనున్నారు.