తెలంగాణ రాష్ట్రంలో మహిళలు, బాలికల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన షీ టీమ్స్ అద్భుతమైన రీతిలో పనిచేస్తున్నాయని కేంద్ర మంత్రి మహేష్ శర్మ ప్రశంసించారు. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో సేవ భారతి ఆధ్వర్యంలో గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ నినాదంతో నిర్వహించిన రన్ కార్యక్రమంలో కేంద్రమంత్రి మహేశ్ శర్మ, రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయమని తెలిపారు. మహిళల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య ప్రాధాన్యత ఇస్తోందని ఇది అభినందనీయమని కొనియాడారు. మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ భారతదేశంలో ఉన్నవారు ఒకవైపు లేనివారు ఇంకోవైపు ఉన్నారని…ఈ అసమానతలు తొలగించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని అన్నారు.
అనాథ పిల్లలను సేవభారతి ఆదుకోవడం మంచి కార్యక్రమమని కొనియాడారు. సేవభారతి చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఆడపిల్లలకు విద్యతో పాటు స్వంతంగా ఎదిగే తోడ్పాటు అందించాలని కోరుకోవడం మంచి పరిణామమని అన్నారు. దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా మహిళా సంక్షేమానికి తెలంగాణ రాష్ట్రం తోడ్పాడు అందిస్తోందని మంత్రి తెలిపారు. షీ టీమ్స్ ద్వారా అమ్మాయిలకు భద్రతా కల్పిస్తున్నామని వివరించారు.