సబ్బండవర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక పరిపుష్టి సాధించాలన్న లక్ష్యంతో ఇప్పటికే గొల్ల, కురుమ, యాదవులకు సబ్సిడీపై జీవాలను అందజేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో పాడి రైతులకు గేదెలను పంపిణీ చేస్తామని ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన కసరత్తు దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. ఒక్కో యూనిట్లో ఒక గేదె ఉండనుంది. యూనిట్ ధర, సబ్సిడీ, ఏ రకం గేదెలు అందజేయాలనే విషయంపై రాష్ట్ర పశు సంవర్థక శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వం పాడి రైతులకు సబ్సిడీపై గేదెలను అందజేయనుంది.
నెల రోజుల్లో పంపిణీ మొదలు పెట్టే అవకాశాలున్నట్టు అధికార వర్గాల ద్వారా తెలిసిందిపాల ఉత్పత్తిదారుల సహకార సంఘాల్లో సభ్యులుగా చేరిన పాడి రైతులకే సబ్సిడీపై గేదెలను ఇవ్వాలని ప్రభుత్వం ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది. సహకార సంఘాల్లో సభ్యత్వం లేకుండా వ్యక్తిగతంగా పాడిపై ఆధారపడిన వారికి అందజేయకపోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆధీనంలో విజయ డెయిరీ ఉండగా.. సహకార రంగంలో మదర్ డెయిరీ (నార్ముల్), కరీంనగర్ డెయిరీ, ముల్కనూర్ డెయిరీలు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 2.17 లక్షల మంది పాడి రైతులు సభ్యులుగా నమోదయ్యారు. రంగారెడ్డి జిల్లాలో సుమారు 10 వేల మందికి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార సంఘాల్లో సభ్యత్వం ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం గేదెల అందజేత ఎప్పుడు మొదలుపెట్టినా.. వీరికి లబ్ధి కలగనుంది.
ఇప్పటికే పాల ఉత్పత్తిలో జిల్లా ముందు వరుసలో ఉంది. ఇక సబ్సిడీపై గేదెలు అందజేస్తే ఉత్పత్తి గణనీయంగా పెరిగి.. పాడి రైతులకు ఆదాయం ఒనగూరనుంది. కాగా, యూనిట్ విలువ రూ.70 వేలు నుంచి రూ.80 వేలు ఉండొచ్చని అంచనా. ఒక్కో యూనిట్పై కనీసం 50 శాతం సబ్సిడీ ఉండనుంది. ఎస్సీ, ఎస్టీలకు 75 శాతం సబ్సిడీ ఇవ్వనున్నారు. యూనిట్ ధరలో సబ్సిడీపోను మిగిలిన సొమ్మును లబ్ధిదారులు భరించాల్సి ఉంటుంది. పాల దిగుబడి అధికంగా ఉండే మేలు జాతి గేదెలను అందజేసే అవకాశం ఉంది. దిగుమతి కోసం గేదెల లభ్యతతోపాటు మేలు జాతివి అధికంగా ఉంటే ఇతర రాష్ట్రాలపై ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా హరియాణా, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.