ఈరోజు 25.01.2018 గురువారం హుస్నాబాద్ శాసన సభ్యులు వొడితల సతీష్ కుమార్ ఎల్కతుర్తి మండల పరిషత్తు కార్యాలయంలో 37 మంది లబ్ది దారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను (రూ.75,116/) అందజేశారు. అలాగే ఇద్దరు లబ్దిదారులకు రూ.10 వేల చొప్పున ఆపద్బంధు చెక్కులను ఇచ్చారు. ఐదు ఈద్గాల అభివృద్దికి రూ.10 వేల చొప్పున చెక్కుల్ని అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ మట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను టీ ఆర్ ఎస్ ప్రభుత్వం అమలు చేస్తోందని అన్నారు. ఆసరా, వికలాంగుల, ఒంటరి మహిళల పించన్ల ద్వారా ఎన్నో వేల కుటుంబాలకు లబ్ది చేకూరుతోందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా టీ ఆర్ ఎస్ ప్రభుత్వంలో అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు అమలు అవుతున్నాయని, హుస్నాబాద్ నియోజకవర్గంలోనూ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున అమలవుతున్నాయని తెలిపారు.
ముఖ్యంగా పేదింటి ఆడపిల్లల పెళ్లిల్లకు ఆర్థిక సహాయం అందించడం గొప్ప విషయమని, కేసీఆర్ పెళ్లి కూతుర్లకు మేనమామలా అండగా నిలుస్తున్నారని ప్రశంసించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అద్వితీయమని, అదొక అద్భుతమని ఎమ్మెల్యే వి.సతీష్ కుమార్ అన్నారు. ఇటీవల గవర్నర్, కేంద్ర జలవనరుల సంఘం ప్రతినిధులు ప్రాజెక్టు నిర్మాణం చూసి ఆశ్చర్య పోయారని అన్నారు. కాళేశ్వరం ద్వారా నీళ్లు మిడ్ మానేరుకు.. అక్కడి నుండి గౌరవెళ్లి, గండిపల్లి ప్రాజెక్టుకు అందుతుందని, రాబోనే కాలంలో లక్షా 20 వేల ఎకరాలకు సమృద్దిగా సాగునీరు అందుతుందని అన్నారు. ఇటీవల హరీష్ రావు గండిపల్లిలో పునర్నిమాణ పనులకు శంకుస్థాపన చేసిన సందర్భంగా ఇది వరదకాలువ కాదని, “జీవ కాలువ” అని పేర్కొన్నారని ఎమ్మెల్యే గుర్తు చేసారు.
కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గానికి రాబోయే కాలంలో మొత్తం 16 టీ ఎం సీల నీళ్లు వచ్చేవిధంగా ప్రణాళిక ఉందన్నారు. రాబోయే కాలంలో హుస్నాబాద్ నియోజకవర్గం సాగునీటి జలాలతో సస్యశ్యామలం అవుతుందన్నారు. గతంలో సీ ఎం కేసీఆర్ గారితో చర్చించి నియోజకవర్గానికి దేవాదుల ప్రాజెక్టు నుండి నీళ్లు వచ్చేలా కృషి చేసినట్లు ఆయన తెలిపారు. బీడుభూములు సాగులోకి రావాలని, ఇంటింటికీ తాగు నీరు ఇవ్వాలని, అందరి ముఖాల్లో ఆనందం చూడాలన్నదే సీ ఎం కే సీ ఆర్ తపన అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తంగెడ శాలిని మహేందర్ తో పాటు టీ ఆర్ ఎస్ ముఖ్యనేతలు, కార్యకర్తలు, మండల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.