నిజామాబాద్ జిల్లా యువతకు ఎంపీ కల్వకుంట్ల కవిత బంపర్ ఆఫర్ ప్రకటించారు. కేంద్ర గ్రంథాలయంలో ఉచిత భోజనం పెట్టే కార్యక్రమాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వర రావుతో నిజామాబాద్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో భోజనం పెడుతున్న నేపథ్యంలో తమకు కూడా ఉచిత భోజన సౌకర్యం కల్పించాలని రోజు లైబ్రరీకి వచ్చే రిటైరయిన ఉద్యోగులు, పాఠకులు, పోటీపరీక్షలకు ప్రిపేరయ్యే విద్యార్థులు తనకు విజ్ఞప్తి చేశారని చెప్పారు. దీంతో లైబ్రరీలో కూడా భోజనం పెడితే మరింత మేలు జరుగుతుందని భావించినట్లు ఎంపీ కవిత వివరించారు.
ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు, నిరుద్యోగులకు ఉపయోగకరంగా ఉంటుంది అని ఉచిత భోజనం పెట్టే ఏర్పాట్లు చేసినట్లు కవిత వివరించారు. ఇందూర్ కవులు, కళాకారులకు పుట్టినిల్లు..లైబ్రరీకి వచ్చే వారి ఆకలి తీర్చడమే తన లక్ష్యం అన్నారు. ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని కోరారు. వాట్సాప్ గ్రూప్లో ప్రతి రోజూ భోజనం కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తానని, నాణ్యత లేని భోజనం ఎట్టి పరిస్థితిలోనూ పెట్టకూడదని నిర్వాహకులకు సూచించారు. హైదరాబాద్లో లభించే పోటీ పరీక్షల కోచింగ్ ను నిజామాబాద్ లైబ్రరీలో ఇప్పిస్తామని ఎంపీ కవిత తెలిపారు. ఏం కోచింగ్ కావాలో చెప్తే సంబందిత కోచింగ్ ఇప్పిస్తామన్నారు. బోధన్, ఆర్మూర్ లైబ్రరీలు బలోపేతానికి జిల్లా లైబ్రరీ నిధులు కేటాయిస్తామని ఎంపీ కవిత తెలిపారు.