భారత రత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ఇవాళ సాయంత్రం ఎయిమ్స్లో తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే.. ఈ సందర్బంగా పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
‘‘మన మాజీ ప్రధాన మంత్రి, నిజమైన భారతీయ రాజనీతిజ్ఞుడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి పరమపదించినట్లు వినడం చాలా విచారకరం. ఆయన నాయకత్వ లక్షణాలు, దూరదృష్టి, పరిణతి, వాగ్ధాటి ఆయనను తనదైన సొంత జట్టులో నిలిపాయి. మృదు స్వభావి అయిన మహోన్నత నేతను ప్రతి ఒక్కరూ కోల్పోయారు’’
– రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్
శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు భౌతికంగా మన మధ్య లేరన్న మాటను నమ్మలేకపోతున్నాను. రాజకీయాల్లో నేతగా, నిలువెత్తు నీతిగా అన్నింటికీ మించి మహోన్నత మానవతా వాదిగా ఎదిగిన వారి వ్యక్తిత్వం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి దాయకం.
– ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
వాజ్పేయి మరణ వార్త వినవలసిరావడం చాలా విచారకరం. గొప్ప వక్త, మనసుకు హత్తుకునే కవి, అసాధారణ ప్రజా సేవకుడు, విశిష్ట పార్లమెంటేరియన్, గొప్ప ప్రధాన మంత్రి అయిన వాజ్పేయి ఆధునిక భారతదేశ మహోన్నత నేతల సరసన నిలిచారు.ఆయన సేవలను మన దేశం రాబోయే సుదీర్ఘకాలంపాటు గుర్తుంచుకుంటుంది.
– మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్
‘వాజ్పేయి ఓ నిస్వార్ధమైన రాజకీయ నాయకుడు. వాజ్పేయిగారితో మూడుసార్లు వేదిక పంచుకొనే అవకాశం దొరికింది. నా మాటలను మెచ్చుకునేవారు ఆయన. నేను, విద్యాసాగర్రావు, వాజ్పేయి కలిసి పనిచేశాం. ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నేను రాజ్యసభ సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించాను. రాజకీయాల్లో వాజపేయి లాంటి మంచి వ్యక్తిత్వం ఉన్న వాళ్లు చాలా అరుదు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని శిరిడి సాయినాధుని కోరుకొంటున్నాను’’
– సినీ నటుడు మోహన్బాబు
నిజమైన రాజనీతిజ్ఞుడు మరణించారు. నాయకుడు అనే పదానికి నిజమైన నిర్వచనం వాజ్పేయి.. ప్రసంగాల్లో వాజ్పెయి దిట్ట. మన దేశ అభివృద్ధిలో పాలుపంచుకునే భవిష్యత్తు తరాలు ఆయన్ను గుర్తుంచుకుంటాయి
– మంత్రి కేటీఆర్