దేశం గర్వించదగ్గ నాయకుడు, మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయికి యావత్ బీజేపీ శ్రేణులు సమున్నత రీతిలో ఘన నివాళులు అర్పించిన నేపథ్యంలో నాటి ప్రధాని పీవీ నరసింహారావు ఉదంతాన్ని నెటిజన్లు గుర్తుచేస్తున్నారు. దశాబ్దాలుగా పార్టీకి సేవ చేసినప్పటికీ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలోకి ఆయన పార్థివ దేహాన్ని తీసుకురానివ్వని వైనాన్ని గుర్తుకు తెచ్చుకుని నిప్పులు చెరుగుతున్నారు.సీనియర్ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ ట్విట్టర్లో స్పందిస్తూ.. అటల్జీకి తన అంతిమయాత్రలో బీజేపీ న్యాయం చేస్తున్నది. కానీ, దివంగత మాజీ ప్రధాని పీవీ విషయంలో కాంగ్రెస్ ఇప్పటివరకూ ప్రాయశ్చితం చేసుకోలేకపోయింది. భారత్కు చెందిన గొప్ప ప్రధానుల జాబితాలో అటల్జీకి తగిన గౌరవం దక్కింది అంటూ వ్యాఖ్యానించారు.
తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు(83) 2004, డిసెంబర్ 23న కన్నుమూశారు. ఆరు దశాబ్దాలకుపైగా కాంగ్రెస్కు అసమాన సేవలందించిన తెలుగు తేజానికి అంతిమ కాలంలో జరిగిన అవమానాలు అన్నీఇన్నీ కావు. పీవీ పార్థివదేహాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలోకి రానీయని పరిస్థితి. ముక్కుతుడుపుగా కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ, నాటి ప్రధాని మన్మోహన్సింగ్ నివాళులు అర్పించి.. వెంటనే భౌతికకాయాన్ని హైదరాబాద్కు తరలించాలంటూ కుటుంబసభ్యులపై ఒత్తిడిచేశారు. కానీ, పీవీకి ఢిల్లీలోనే అంత్యక్రియలు నిర్వహించి, స్మారకాన్ని నిర్మించాలంటూ ఆయన కుమారుడు ప్రభాకర్రావు తెగేసి చెప్పారు. కానీ, సోనియా ఆంతరంగికులు చక్రం తిప్పి బలవంతంగా పీవీ పార్థివదేహాన్ని హైదరాబాద్కు తరలించారు. పీవీకి నెక్లెస్ రోడ్డులో అంత్యక్రియలు నిర్వహించారు. అంతిమయాత్రకు గాంధీ కుటుంబసభ్యులెవరూ హాజరుకాలేదు. దేశ చరిత్రలో ప్రధానిగా పనిచేసిన వ్యక్తికి ఢిల్లీలో అంత్యక్రియలు నిర్వహించని, స్మారకాన్ని ఏర్పాటుచేయని పరిస్థితి ఒక్క పీవీకే ఎదురైంది.
ఈ పరిస్థితిపై కాంగ్రెస్ నేత వీహెచ్ స్పందించారు. పీవీ నరసింహారావుకు జరిగిన అవమానంపై తెలుగు ప్రజలు సిగ్గు పడుతున్నారని అన్నారు. ఆయనకు మరింత హుందాగా నివాళి అర్పించాల్సిందని పేర్కొన్నారు. కాగా, సొంత పార్టీ నేతలే పీవీకి జరిగిన అవమానంపై స్పందించిన తీరుతో కాంగ్రెస్ పార్టీ తీరు స్పష్టమవుతోందని అంటున్నారు.