`మనకు పొత్తు ముఖ్యం…సీట్లు కాదు..అవసరమైతే మీరు సీట్లు వదులుకోండి. కాంగ్రెస్ నేతల నిర్ణయానికే మద్దతు ఇవ్వండి తప్ప మీరు మీ అభిప్రాయాలను వెల్లడించవద్దు“ ఎన్నికల వ్యూహ రచనల నేపథ్యంలోగత సోమవారం జరిగిన సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన పార్టీ నేతలకు వేసిన ఆర్డర్. అవకాశవాద రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అయిన చంద్రబాబు ఇంత ఓపెన్గా తన పార్టీని పణంగా పెట్టి మరీ ఎదుటి పార్టీ నేతల మాట వినాలని చేసిన ప్రకటన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో గుబులు పుట్టిస్తోంది. అంతేకాకుండా ఆ పార్టీలో చీలికకు కారణం అవుతోంది. తెలంగాణలో టీఆర్ఎస్ తర్వాత కాంగ్రెస్, ఎంఐఎం కాకుండా మరే పార్టీ కూడా అధికార పీఠాన్ని ప్రభావితం చేసే స్థాయిలో లేదు. ఈ పరిస్థితిలో టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల తమకు జరిగే లాభం ఏమిటని తెలంగాణ కాంగ్రెస్లో అంతర్మథనం మొదలైంది.
ఒంటరిపోరు చేయలేని టీడీపీ.. పొత్తు పేరుతో ఆడుతున్న నాటకంలో కాంగ్రెస్ భవితవ్యం ఏమవుతుందోనని ఆ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. పొత్తులో భాగంగా టీడీపీకి ఇచ్చే సీట్లన్నీ టీఆర్ఎస్కు అప్పగించినట్టేనని కాంగ్రెస్ నేతలే అంటున్నారు. ఎలాంటి ఓటుబ్యాంకు లేని టీడీపీ, సీపీఐ, టీజేఎస్తో పొత్తు తమకు ఏ మాత్రం కలిసివస్తుందోనన్న ఆందోళన కాంగ్రెస్లో మొదలైంది. వీటన్నింటికీ తోడుగా బాబు ఇంత ఓపెన్ ఆఫర్తో తెలంగాణలో కాంగ్రెస్తో దోస్తీకి తహతహలాడటం వెనుక ఆయనకు సంబంధించిన రాజకీయ ప్రయోజనాలే ప్రధానంగా ఉండి ఉంటాయి తప్పించి కాంగ్రెస్కు మేలు చేసే అంశాలు తక్కువని ఇంకొందరు పేర్కొంటున్నారు.
ఆంధ్రా ప్రాంత కాంగ్రెస్ నేతల్లోనూ తెలంగాణలో టీడీపీతో పొత్తు ఏపీలో జరిగే ఎన్నికలపై ఏ విధంగా ప్రభావితం చూపుతుందోనన్న భయం మొదలైంది. ఓవైపు రాజకీయ సిద్ధాంతాన్ని తుంగలో తొక్కి పొత్తు పెట్టుకోవడం మరోవైపు తమకు బలం ఉన్నచోట సీట్లు కోల్పోవడం…అదే సమయంలో బాబు అవకాశవాద రాజకీయాలకు అండగా ఉండటం తమకు ఎలా మేలుచేస్తుందని పలువురు కాంగ్రెస్ నేతలు పార్టీ పెద్దలను ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరైతే ఈ పొత్తు వల్ల తమకు నష్టం జరిగితే తాము పార్టీకి గుడ్బై చెప్తామని కూడా హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది.
Post Views: 267