గతంలో ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆపసోపాలు పడుతున్నది. ముఖ్య నాయకులు, కార్యకర్తలను దూరం చేసుకుంటూ ఒంటరిదవుతున్నది. తెల్లారితే గాని తెలియడం లేదు ఆ పార్టీని వీడేదెవరని. ఈ క్రమంలో ఉన్న కొద్ది మంది కార్యకర్తల్లో అంతర్మథం మొదలైంది. పార్టీ సభలు, సమావేశాలకు స్పందన లేదు. ఉన్న నాయకులు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజలు పార్టీని ఏ విధంగా ఆదరిస్తారనే చర్చ జరుగుతున్నది. జిల్లా కేంద్రమైన సంగారెడ్డి నియోజవర్గంలోని పరిస్థితి ఇది. కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆత్మీయులు, సన్నిహితులు కూడా గులాబీ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో ఇక్కడి కాంగ్రెస్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. త్వరలోనే మరికొందరు కాంగ్రెస్ ముఖ్య నాయకులు కూడా టీఆర్ఎస్లో చేరనున్నట్లు జరుగుతున్న ప్రచారంతో ఆ పార్టీ శ్రేణుల్లో గుబులు మొదలైంది. మరోవైపు జగ్గారెడ్డిని కూడా వివిధ రకాల కేసులు భయపెట్టిస్తున్నాయి.
టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులవుతున్న ఇతర పార్టీలకు చెందిన ముఖ్యనాయకులు గులాబీ తీర్థం పుచ్చుకుంటున్నారు. కూటమి నుంచి కాంగ్రెస్ తరుఫున జగ్గారెడ్డి పోటీ చేసే అవకాశాలున్నాయి. కూటమి టిక్కెట్లు ఇంకా కేటాయించకపోయినప్పటికీ ఆయన ప్రచారం చేసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే నిన్నమొన్నటి వరకు ఆయనకు సన్నిహితంగా ఉంటూ వస్తున్న ముఖ్య నాయకులు కూడా మంత్రి హరీశ్రావు, టీఆర్ఎస్ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో టీఆర్ఎస్లో చేరిపోతున్నారు. నాయకులు, కార్యకర్తలు వరుసకట్టి పెద్దఎత్తున టీఆర్ఎస్లో చేరిపోతుండడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో గుబులు మొదలైంది.కొండాపూర్, సదాశివపేట, సంగారెడ్డి, కంది మండలాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు రోజువారీగా టీఆర్ఎస్లో చేరిపోతుండడంతో కాంగ్రెస్ ఆపసోపాలు పడుతున్నది. ఇదిలాఉండగా త్వరలోనే మరికొందరు కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యనాయకులు కూడా టీఆర్ఎస్లో చేరనున్నట్లు జరుగుతున్న ప్రచారంతో జగ్గారెడ్డి కోటరీలో ఆందోళన మొదలవుతున్నది.