అధికారం కోసం ఎంతో ఆశపడి…ఆఖరికి ఘోర ఓటమిని ఎదుర్కున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆ పరాభవం నుంచి తేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఓ వైపు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిభారం…మరోవైపు పంచాయతీ ఎన్నికల కోలాహలం…ఇంకో వైపు ముంచుకువస్తున్న పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో…కాంగ్రెస్ పార్టీ నేతలు ఫాంహౌజ్ విందులు జరుపుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీమంత్రి డీకే అరుణ తన ఫాంహౌజ్లో పార్టీ నేతలకు విందు ఇచ్చారు
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన నేతలు, గెలిచిన ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులందరికీ…హైదరాబాద్ శివారులోని తన ఫాంహౌజ్లో మాజీ మంత్రి డీకే అరుణ ఇచ్చిన విందు ఇచ్చారు. పార్టీ నేతలు జానారెడ్డి, షబ్బీర్అలీ, మధుయాష్కీ, మాజీమంత్రి సునీతా లకా్ష్మరెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, జగ్గారెడ్డి, రేవంత్రెడ్డి తదితరులు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న స్తబ్ధతకు తెరవేసి పంచాయతీ, పార్లమెంట్ ఎన్నికల్లో నేతలంతా చురుగ్గా పాల్గొనేలా చేసేందుకే నేతలకు లంచ్ను ఏర్పాటు చేసినట్లు మాజీమంత్రి డీకే అరుణ తెలిపారు. ఇది విందు సమావేశం కాదని… అందరిని కలిసి మాట్లాడాలనుకుని సమా వేశం పెట్టామన్నారు. ‘ఎక్కడివాళ్ళు అక్కడే ఉండటం కంటే అందరం కలుద్దాం అనుకున్నాం’ అని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నేతలంతా ఒకచోటకూర్చుని మాట్లుడుకునేందుకు ఎవరోఒకరు చొరువ తీసుకోవాలని, ఆ చొరువను తాను తీసుకున్నట్టు తెలిపారు. ఇందులో ఏ విధమైన ఇతర రాజకీయ కారణాలు లేవని పేర్కొన్నారు.
అన్ని జిల్లాలో పొత్తుతో లాభం ఉండదని ముందే చెప్పానని డీకే అరుణ అన్నారు. టీడీపీ బలంగా ఉన్న చోట మాత్రమే లాభం జరిగిందన్నారు. పార్లమెంట్ ఎన్నికలో పొత్తులతో లాభం ఉండదని అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ అంశంపై చర్చ జరగలేదన్నారు. పొత్తుల వల్లే ఓడిపోయామని కాదు…ఎన్నో కారణాలు ఉన్నాయని వివరించారు. టీఆర్ఎస్ ఒక్కోచోట ఒక్కో లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ ను ఓడించిందన్నారు. కంచుకోట లాంటి పాలమూరు జిల్లాలో కూడా కాంగ్రెస్ ఓటమి చూస్తేనే…ఏదో జరిగిందనే అనుమానం కలుగుతున్నదన్నారు. పార్టీ ప్రక్షాళనపై అధిష్టానం ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అధిష్ఠానం తమ కుటుంబానికి అవకాశం ఇస్తే పోటీచేయడానికి సిద్ధమేనని తెలిపారు.