నలభై ఏళ్ల తన రాజకీయ అనుభవాన్ని ఉపయోగించి, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానంటూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు నాలుగేళ్ల పరిపాలనలో ఇచ్చిన ఒక్క హామీనైనా నిలబెట్టుకోలేకపోయారని ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ప్రజలకు ఫలానా మేలు చేశాం అని చెప్పుకోలేని ఆయన దుస్థితి ప్రభుత్వ ఆసమర్థతకు అద్దం పడుతోంది. రాష్ట్రాన్ని ప్రపంచంలోనే నంబర్వన్ చేస్తానని, ఎక్కడా లేని రీతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధానిని నిర్మిస్తానని ఎన్నికల ప్రచారంలో హోరెత్తించిన చంద్రబాబు గద్దెనెక్కాక ఆ మాటే మర్చిపోయారు. అసమర్థతకు అభివృద్ధి అనే ముసుగు వేస్తూ జనాన్ని భ్రమల్లో ముంచుతున్నారు. నాలుగేళ్ల పాలనలో చంద్రబాబు నాయుడు ఏదైనా సాధించారా? అని చూస్తే నిరాశే ఎదురవుతోంది.
కార్మికులు, కర్షకులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఎస్సీ, ఎస్టీలు, వెనుకబడిన తరగతులు ఇలా ఎవ్వరికీ చంద్రబాబు పాలనలో మేలు జరగలేదు. పదేళ్లు అధికారానికి దూరమై రాజకీయ అస్తిత్వం కోల్పోయే దశకు చేరువైన చంద్రబాబు 2014 ఎన్నికలకు ముందు 600కుపైగా హామీలతో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. వ్యవసాయ రుణాలను మాఫీ చేసి రైతులకు రుణ విముక్తి కల్పిస్తానని.. రూ.5.000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి, పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తానంటూ ఇచ్చిన హామీలకు తూట్లు పొడిచారు. రైతుల నెత్తిన అప్పుల భారం పెరిగిపోయింది. పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామంటూ హామీ ఇచ్చి విస్మరించారు.
డ్వాక్రా మహిళలు అప్పులూ మాఫీ చేయకుండా నయవంచనకు పాల్పడ్డారు. మహిళలపై దాడులు, చిన్నారులపై అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేయడంలో విఫలమయ్యారు చంద్రబాబు విధానాల వల్ల విపరీతమైన అవినీతి పెరిగిపోయిందని సీనియర్ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.