లోక్సభ ఎన్నికల హోరాహోరీ పోరు షెడ్యూల్ విడుదల కాకమందే మొదలైన సంగతి తెలిసిందే. ఓవైపు కేంద్ర ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్న బీజేపీ ఎన్నికల తాయిలాలకు సిద్ధమవుతుంటే…మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ సైతం సై అంది. ఛత్తీస్గడ్లోని రాయ్పూర్ కిసాన్ అభార్ సమ్మేళనంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహల్ గాంధీ మాట్లాడుతు..పార్లమెంట్ ఎన్నికల్లో గెలిస్తే పేదలకు నిర్ధిష్ట ఆదాయం అమలు చేస్తామని.. నేరుగా పేదల బ్యాంక్ ఖాతాలలోకే నేరుగా డబ్బులు వేస్తామని ప్రకటించారు.
కాంగ్రెస్ గతంలో అనేక చారిత్రక నిర్ణయాలను తీసుకుందన్న రాహుల్.. 2019లో అధికారంలోకి వస్తే.. మరో చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంటామన్నారు.పేదలు ఆకలితో అలమటిస్తుంటే నవ భారతాన్ని ఎలా నిర్మిస్తామనీ..పేదలు కడుపు నిండా అన్నం తిని వారు అభివృద్ధి చెందినప్పుడు నవభారత నిర్మాణానికి అర్థముంటుదని రాహుల్ పేర్కొన్నారు. తాము అధికారంలోకి వస్తే.. దేశంలోని పేదలందరికీ కనీస ఆదాయాన్ని అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఆకలి, పేదరికం లేని నవభారత నిర్మాణమే తమ లక్ష్యమని రాహుల్ ప్రకటించారు.
కాగా, రాహుల్ చెబుతున్న పథకం అమల్లోకి వస్తే.. దేశంలో పేదలందరూ కనీస ఆదాయం పొందనున్నారు. యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన గ్రామీణ ఉపాధి హామీ పథకం యూపీఏ తిరిగి అధికారంలోకి రావడానికి దోహదం చేసిన సంగతి తెలిసిందే. 100 రోజుల పని పథకానికి ఇది కొనసాగింపుగా భావించవచ్చిన విశ్లేషకులు భావిస్తున్నారు.