ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరోమారు ప్రధానమంత్రి నరేంద్రమోడీపై విమర్శలు చేశారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా బుధవారం ఢిల్లీలోని జంతర మంతర్ వద్ద కేజ్రీవాల్ చేపట్టిన తానాషాహీ హటావో – దేశ్ బచావో ధర్నాకు చంద్రబాబు హాజరై సంఘీభావం తెలిపారు. ధర్నా సభలో మాట్లాడుతూ ఎంతో ఘన చరిత్ర కలిగిన భారతదేశంలో ఇంగ్లీష్ మాట్లాడే చదువుకున్న వారు ఎక్కువగా ఉన్నారని తెలిపారు. ఇటువంటి దేశానికి చదవురాని నరేంద్ర మోడీ ప్రధాని కావడమే సమస్య అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
ప్రధాని మోడీతో పాటు అమిత్షాలు అత్యంత ప్రమాదకర వ్యక్తులని ఏపీ ముఖ్యమంత్రి సెలవిచ్చారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్న చంద్రబాబు దేశాన్ని రక్షించుకోవాడానికి అందరూ కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. మోడీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని ఆకాంక్షించారు. కేజ్రీవాల్ కు దేశం మొత్తం అండగా ఉంటుందని తెలిపారు. రాష్ట్రాలంటే ఒకరిపై ఆధారపడే వారు కాదని చెప్పిన ఆయన తమకూ హక్కులు, అధికారాలూ ఉన్నాయని పేర్కొన్నారు. వాటి గురించి ప్రశ్నిస్తే కేంద్ర సంస్థలతో మోడీ దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటి వరకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో సిబిఐ, ఐటి, ఈడీలు కలిపి 28 సార్లు దాడులు చేశారని, ఇవ్వన్ని ప్రతిపక్ష నేతల్ని టార్గెట్ చేసుకునే చేసినవని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి వ్యవహారాలను తాము సహించబోమని పోరాటంతో ఎదుర్కొంటామన్నారు. న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదన్నారు. దేశ హితం కోసం ఆలోచించేవారందరూ తమకు మద్ధతు తెలపాలని చంద్రబాబు అన్నారు. బిజెపి, ఎన్డీఏ వర్గాలపై కేంద్ర సంస్థలు ఎందుకు దాడులు జరగలేదని వారంతా నిజాయితీపరులా అంటూ ప్రశ్నించారు. బిజెపి, ఎన్టీఏ ఒక వర్గంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రతిపక్షాలు ఒకవర్గంగా దేశం మొత్తం విడిపోయిందన్నారు.