ఏపీలో జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి ఖాయమైందా? ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎందుకు ఓటమికి సంబంధించిన వ్యాఖ్యలు చేస్తున్నారు? ఇది ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్గా మారిన అంశం. తెలుగుదేశం పార్టీ గెలుపు గురించి ఉండవల్లిలోని ప్రజావేదికలో సోమవారం టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో చంద్రబాబు నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన కామెంట్లు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
పోలింగ్ సరళి, ఈవీఎంలకు సంబంధించిన అంశాలపై చంద్రబాబు, ముఖ్య నేతలు అడిగిన వాటిపైనా అభ్యర్థులు రకరకాలుగా సమాధానాలు చెప్పడంతో గందరగోళం నెలకొంది. ఈ సందర్భంగా చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలోనే ఉంటూ పరోక్షంగా వైకాపాకు సహకరించారని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు, ముఖ్య నేతలు దిగువస్థాయి నేతలను కలుపుకువెళ్ళడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. తద్వారా ఓటమికి నేతలదే తప్పు అనే భావనను కల్పించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, అధికారం ఉన్నా లేకున్నా ప్రజల అవసరాలను తీర్చే బాధ్యత మనపై ఉందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికలు ఫలితాలు వచ్చినఅనంతరం స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయని దీనికి అందరు సర్వసన్నద్దంగా ఉండాలని స్పష్టం చేశారు. గంటల తరబడి క్యూలైన్లో ఉండి ఓట్లు వేసినవారందరికి కృతజ్ఞతలు తెలపాలని నియోజకవర్గాలవారీగా మంగళవారం నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని స్పష్టం చేశారు.