తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పాల్పడ్డ భారీ అవినీతి పర్వం అందరికీ సుపరిచితమే. ఈ విషయంలో వైసీపీ అధినేత తీసుకుంటున్ననిర్ణయాలకు వ్యతిరేకంగా కొందరు అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలపై ఆయన ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వద్దే అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సాంప్రదాయేతర ఇంధన ధరలను గత ప్రభుత్వం ఎక్కువగా నిర్ణయించిందని సీఎం జగన్ ఆరోపించిన సంగతి తెలిసిందే. మూడు, మూడున్నర రూపాయలు ఉండే యూనిట్ ధరను ఆరు రూపాయలకు పైగా పెంచి కొన్నారని సీఎం జగన్ ఆరోపించారు.
అయితే, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) సమీక్షించాలని సీఎం జగన్ నిర్ణయించగా… పీపీఏల సమీక్ష మంచిది కాదంటూ ఏపీ సీఎస్కు కేంద్ర ఇంధనశాఖ కార్యదర్శి లేఖ రాశారు. ఇలా చేయడం వల్ల పరిశ్రమలు రావని, పెట్టుబడి దారులు భయపడతారని లేఖలో ఇంధన శాఖ కార్యదర్శి పేర్కొన్నారు. పీపీఏలను సమీక్షిస్తామన్న సీఎం జగన్ వ్యాఖ్యలను టీవీల్లో, పేపర్లలో చూసి లేఖరాస్తున్నానని.. తన లేఖను సీఎం జగన్కు చూపించాలని సీఎస్కు ఇంధనశాఖ కార్యదర్శి సూచించారు. కేంద్ర ఇంధనశాఖ కార్యదర్శి లేఖను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీరియస్గా తీసుకున్నారు.
తిరుపతిలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా…ఇంధన కార్యదర్శి రాసిన లేఖను ప్రధానికి చూపించారు. దీనిపై స్పందించిన ప్రధాని నరేంద్ర మోడీ… తప్పు జరిగినప్పుడు సమీక్షించడంలో తప్పేముందని వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. మొత్తానికి, వెనక్కి తగ్గని ఏపీ సీఎం.. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను పునర్ సమీక్షించనున్నారు. ఈ నేపథ్యంలో జగన్ నిర్ణయంపై ఆసక్తి నెలకొంది.