కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు శుక్రవారం పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పలు కీలక కేటాయింపులకు సంబంధించిన కొన్ని ప్రకటనలు చేశారు.అందులో భాగంగా ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన కింద కొత్తగా 1.97కోట్ల ఇళ్లు కేటాయించినట్లు తెలిపారు. 114 రోజుల్లో ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని నిర్మల స్పష్టం చేశారు.
ప్రభుత్వరంగ సంస్థల భూముల్లో పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వనున్నట్లు ప్రకటించారు.ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన ద్వారా రూ.80,250 కోట్లతో రోడ్ల నిర్మాణం, గ్రామాల కనెక్టివిటీ కోసం 1.25లక్షల కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.
కొత్త ఇంటి కోసం తీసుకునే రుణాలపై వడ్డీని భారీగా తగ్గిస్తున్నట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. గృహ రుణాలపై వడ్డీ రాయితీ 2 లక్షల నుంచి 3.5 లక్షల వరకు పెంచుతున్నట్లు తెలిపారు. దాంతో గృహ రుణాలపై లక్షన్నర వరకు వడ్డీ తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఇది పేద, మధ్య తరగతి వర్గాల వారికి చాలా ఉపయోగపడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. 45 లక్షల రూపాయలకు లోబడిన గృహ రుణాలకు 3.5 లక్షల రాయితీ లభించనున్నట్లు ఆమె ప్రకటించారు.