టీడీపీ సభ్యులపై ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం శుక్రవారం నాడు అసహనాన్ని వ్యక్తం చేశారు. అధికార పక్ష సభ్యులు మాట్లాడుతున్న సమయంలో విపక్షపార్టీకి చెందిన ఎమ్మెల్యేలు గొడవ చేయడంతో సభలో గందరగోళ వాతావరణం చోటు చేసుకొంది. ఈ సమయంలో స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడారు.శుక్రవారం నాడు వడ్డీ రాయితీ లేని అప్పుల విషయమై అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది.
ఈ సమయంలో స్పీకర్ తమ్మినేని సీతారాం జోక్యం చేసుకొన్నారు. ఇదేమీ ఫిష్ మార్కెట్ కాదు. సభ్యుల ప్రవర్తనను ప్రజలు చూస్తున్నారని ఆయన గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కానీ, విపక్షనేత కానీ మాట్లాడే సమయంలో ఎవరూ కూడ అడ్డుతగలకూడదని ఆయన కోరారు. సభ నిర్వహణలో ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గడం లేదన్నారు.హుందాగా సభను నడిపించేందుకు తాను ప్రయత్నిస్తున్నట్టుగా ఆయన చెప్పారు. సభను హుందాగా నడిపించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని తమ్మినేని కోరారు.