సిరిసిల్ల తెలంగాణ ప్రభుత్వం ఏర్పడగానే పింఛన్లు 5 రెట్లకు పెంచుకున్నామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీడీ కార్మికులకు కూడా పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పింఛన్లను రెట్టింపు చేశామని వివరించారు.
సిరిసిల్లలో పింఛన్ లబ్ధిదారులకు కేటీఆర్ మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. పెంచిన ఆసరా పెన్షన్ల ప్రొసీడింగ్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని కేటీఆర్ ప్రసంగించారు.17శాతం వృద్ధిరేటుతో అన్ని రాష్ర్టాల కంటే తెలంగాణ ముందుంది. పింఛను అర్హత వయసు తగ్గింపు కూడా జూన్ నెల నుంచే వర్తిస్తుంది. బీడీ కార్మికులకు పీఎఫ్ కటాఫ్ తేదీని తగ్గించడంతో కొత్తగా 2 లక్షల మందికి పింఛను అందుతుంది. నిర్మాణం పూర్తయిన రెండు పడక గదుల ఇళ్లను త్వరలోనే లబ్ధిదారులకు అందిస్తాం. సుమారు రూ.20లక్షల విలువ చేసే డబుల్ బెడ్ రూం ఇళ్లను ఉచితంగానే ఇస్తున్నాం.
ప్రభుత్వ ఇళ్ల కోసం ఎవరూ.. ఒక్క రూపాయి కూడా ఎవరికీ ఇవ్వొద్దు. ఆశావహులు ఎక్కువున్న చోట లాటరీ తీసి ఇళ్లను కేటాయిస్తాం. ఇందిరమ్మ ఇళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.70వేలు మాత్రమే ఖర్చు చేసింది. దశాబ్దాలుగా ఉన్న ఇళ్ల పట్టాల సమస్యలు పరిష్కరించాం. సిరిసిల్లలో 1500 ఇండ్ల నిర్మాణం పూర్తికావొచ్చింది. ఇంటి స్థలం ఉన్న పేదలు ఇల్లు కట్టుకోవడానికి రూ.5లక్షలు. బతుకమ్మ చీరల బకాయిలు త్వరలోనే విడుదల చేయిస్తాం. వడ్డీలేని రుణాల నిధులు కూడా విడుదల కాబోతున్నాయి. ఆదాయం పెంచాలి.. పేదలకు పంచాలనేదే సీఎం కేసీఆర్ ధ్యేయం.’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
Post Views: 269