ఏపీ టీడీపీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ నాయుడుకు ఆ పార్టీకి రాజీనామా చేసిన గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సవాల్ విసిరారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ” నేను పార్టీకి రాజీనామా చేశాను. నేను కేవలం నా నియోజకవర్గం అభివృద్ధికోసం.. గత ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలకిచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చడానికి మాత్రమే వైసీపీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నాను.
ఒకవేళ నేను వైసీపీ పార్టీలో చేరాలనుకుంటే ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్ది ఆదేశిస్తే ఖచ్చితంగా ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేస్తాను. గన్నవరం ఉప ఎన్నికల్లో నేను గెలిచి తీరతాను. మరి నారా లోకేశ్ నాయుడు దమ్ముంటే ఎమ్మెల్సీ పదవీకి రాజీనామా చేస్తారా” అని సవాలు విసిరారు.
నేను లోకేశ్ మాదిరిగా అడ్డదారిలో మంత్రిని కాలేదు.. ఎమ్మెల్సీ అంతకంటే కాలేదు. నన్ను నమ్మి ప్రజలు ఓట్లేస్తే రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యాను అని ఆయన అన్నారు. నిజంగా లోకేశ్ కు దమ్ముంటే ఎమ్మెల్సీ కి రాజీనామా చేసి గన్నవరం ఉప ఎన్నికల్లో నాపై నిలబడి గెలవాలి అని ఆయన సవాల్ విసిరారు.