హైదరాబాద్ లో ఆరు నెలలుగా నిలిచిపోయిన ప్రజా రవాణా తిరిగి పట్టాలెక్కనుందా? నిలిచిపోయిన సిటీ బస్సులు రోడ్డెక్కనున్నాయా? అన్లాక్ 4.0లో భాగంగా కేంద్రం సెప్టెంబరులో మెట్రో రైళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్న దృష్ట్యా గ్రేటర్లో ఎంఎంటీఎస్ రైళ్లు, సిటీబస్సుల రాకపోకలపై ఆశలు చిగురిస్తున్నాయి.
మరోవైపు ఏ క్షణంలోనైనా వీటికి అనుమతి లభించవచ్చనే అంచనాలతో ఆర్టీసీ అధికారులు సన్నద్ధమవుతున్నారు.
లాంగ్ రూట్లకే పరిమితం..
ప్రభుత్వం అనుమతిస్తే ప్రధాన రూట్లలో మాత్రమే బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ఈ దిశగా అధికారులు ఇప్పటికే కొన్ని మార్గాలను ఎంపిక చేశారు. హయత్నగర్– పటాన్చెరు, లంగర్హౌస్– రిసాలాబజార్, ఉప్పల్–మెహిదీపట్నం, సికింద్రాబాద్– బీహెచ్ఈఎల్, జీడిమెట్ల– ఎంజీబీఎస్ వంటి కొన్ని రూట్లలో మాత్రమే నడపనున్నారు.
సికింద్రాబాద్ నుంచి, కూకట్పల్లి నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు ఏసీ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ప్రయాణికులకు టికెట్లు ఎలా ఇవ్వాలనే అంశంపై కూడా ఆర్టీసీలో చర్చలు జరుగుతున్నాయి.
ఒకవేళ సెప్టెంబరు 1 నుంచి బస్సులు నడిపేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చినప్పటికీ కోవిడ్ ఉద్ధృతి మాత్రం ఇప్పట్లో తగ్గే అవకాశం లేదు.
ఈ పరిస్థితుల్లో బస్సులోకి ప్రవేశించే ప్రతి ఒక్కరినీ థర్మల్ స్క్రీనింగ్ చేయడం సాధ్యమవుతుందా అనే అంశంపై కూడా చర్చలు జరుగుతున్నాయి.