తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఉదయం 11 గంటలకు ప్రారంభం అయ్యాయి. శాసనసభను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలిని చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రారంభించారు.
ఇటీవల మరణించిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ, దుబ్బాక ఎమ్మెల్యే సొలిపేట రామలింగారెడ్డికి సభ నివాళులర్పించింది. వారి సేవలను సభ్యులు గుర్తు చేశారు. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో సభ్యులతో పాటు అసెంబ్లీ సిబ్బంది భౌతిక దూరం పాటిస్తూ, విధిగా మాస్కు ధరించారు.
కరోనా నేపథ్యంలో ఉభయ సభల నిర్వహణకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. కరోనా నిర్ధారణ పరీక్షల్లో నెగిటివ్ వచ్చిన వారినే లోపలికి అనుమతించారు. సభలో ఒక సీట్లో ఒకరే కూర్చొనేలా.. అదనంగా అసెంబ్లీలో 40, మండలిలో 8 సీట్లు ఏర్పాటు చేశారు.
అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అసెంబ్లీ సిబ్బంది, మీడియా ప్రతినిధులు, పోలీసులకు కరోనా టెస్టులు చేశారు. అసెంబ్లీ ఆవరణలోని పలు ప్రాంతాల్లో శానిటైజర్ యంత్రాలు, ప్రత్యేక కెమెరాలు ఏర్పాటు చేశారు.
వీటిలో మాస్కు ధరించని వారి వివరాలు, వారి ఉష్ణోగ్రతలు ఎప్పుటికప్పుడు తెలుస్తాయి. అసెంబ్లీకి వచ్చే ఫైల్స్ను శానిటైజ్ చేసేందుకు ప్రత్యేక యంత్రాలను అమర్చారు. సందర్శకులను, ఎమ్మెల్యేల పీఏలను అనుమతించలేదు. మీడియాను పరిమిత సంఖ్యలోనే అనుమతించారు. మంత్రుల పేషీ నుంచి ఒక పీఏ, ఒక పీఎస్నే మాత్రమే అనుమతించారు.