దుబ్బాకలో ఓట్లు అడిగేందుకు వస్తున్న కాంగ్రెస్, బీజేపీ నేతలు ఎన్నిక ముగిశాక మళ్లీ కనిపించరని మంత్రి హరీశ్రావు అన్నారు. పెద్ద పెద్ద కార్లు, సూట్కేసులతో వస్తున్నారని, కానీ.. ప్రలోభాలకు, మాయమాటలకు ఇక్కడ ఓట్లు పడవని వ్యాఖ్యానించారు. నియోజకవర్గంలో ఆ రెండు పార్టీలకు అభ్యర్థులు మాత్రమే మిగిలారని, కార్యకర్తలంతా ఎప్పుడో ఖాళీ అయ్యారని, నాయకులకు తోవ చూపించేవారు కూడా కరువయ్యారని ఎద్దేవా చేశారు.
శుక్రవారం కాంగ్రెస్ సీనియర్ నేత, 2008 ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి భూంపల్లి మనోహర్రావు, టీపీసీసీ ప్రచార కార్యదర్శి కోమటిరెడ్డి వెంకటనర్సింహారెడ్డి తమ అనుచరులతో కలిసి మంత్రి హరీశ్రావు, ఎంపీ ప్రభాకర్రెడ్డి సమక్షంలో టీఆర్ఎ్సలో చేరారు.
ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అహర్నిశలు శ్రమించినవారిని కాదని వేరే వారికి టికెట్ ఇవ్వడం ఆ పార్టీ విశ్వసనీయతకు అద్దం పడుతోందన్నారు. కానీ, టీఆర్ఎ్సలో ఉద్యమంలో పనిచేసిన సోలిపేట రామలింగారెడ్డికి సీఎం కేసీఆర్ తగిన గుర్తింపునివ్వడంతోపాటు ఆయన కుటుంబానికి అండగా నిలిచి మళ్లీ టికెట్ ఇచ్చారన్నారు.