జీహెచ్ఎంసీతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న క్షౌరశాలలు(సెలున్లు)కు ప్రభుత్వం డిసెంబర్ నెల నుంచి ఉచిత విద్యుత్ సరఫరా చేయనుంది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ప్రకటించారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ నేడు తెలంగాణ భవన్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. నాయి బ్రాహ్మణులు చాలా కాలంగా కోరుతున్న ఈ కోరికను రాబోయే డిసెంబర్ నుంచి ప్రభుత్వం నెరవేర్చనున్నట్లు తెలిపారు. నాయి బ్రాహ్మణుల ఆర్థిక పురోభివృద్ధికి ఈ చర్య తోడ్పడుతుందని సీఎం పేర్కొన్నారు.
మన హైదరాబాద్ అందరికంటే ముందు అభివృద్ధిలో ముందు ట్యాగ్లైన్తో సీఎం పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. హైదరాబాద్ నగర సమగ్ర, సుస్థిర అభివృద్ధికి టీఆర్ఎస్ పార్టీ ప్రతిపాదిస్తున్న ఎన్నికల ప్రణాళిక అన్నారు.
సుందరమైన, పరిశుభ్రమైన, పచ్చదనంతో కూడిన నగరం దిశగా ప్రయాణానించేందుకు అండదండలివ్వాల్సిందిగా కోరారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటేసి టీఆర్ఎస్ అభ్యర్థులను కార్పొరేటర్లుగా గెలిపించాల్సిందిగా కోరారు.