తెలంగాణ రాష్ర్ట ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వరంగల్ నగరంలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా వరంగల్ నగరం లక్ష్మీపురంలో రూ. 24 కోట్లతో నిర్మించిన అత్యాధునిక సమీకృత మార్కెట్ను, రూ. 6.24 కోట్లతో నిర్మించిన ఆదర్శ కూరగాయల మార్కెట్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఎల్బీనగర్లో నిర్మిస్తున్న షాదీ ఖానా, మండి బజార్ లో నిర్మిస్తున్న హజ్ హౌజ్ పనులకు శంకుస్థాపన చేశారు.
రూ.60 కోట్లు నిధులతో పూర్తిచేసిన ఆర్వోబీ, రు. 7.8కోట్ల నిధులతో అండర్ బ్రిడ్జికి సమాంతరంగా నిర్మించిన నూతన బ్రిడ్జిని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.అంతకుముందు వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలకు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. దూపకుంటలో రూ. 31.80 కోట్లతో నిర్మిస్తున్న 600 డబుల్ బెడ్రూం ఇండ్లు, దేశాయిపేటలో రూ. 10.60 కోట్లతో జర్నలిస్టుల కోసం కడుతున్న 200 డబుల్ బెడ్రూం ఇండ్ల పనులకు కేటీఆర్ శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణతో పాటు జర్నలిస్టులు పాల్గొన్నారు.ఇవాళ ఉదయం రాంపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ను కేటీఆర్ ప్రారంభం చేశారు. ఈ ట్యాంక్ సామర్థ్యం 8 లక్షల లీటర్లు. వాటర్ ట్యాంకు అందుబాటులోకి రావడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వాటర్ ట్యాంకు ప్రారంభం కంటే ముందు అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను మంత్రి కేటీఆర్ వీక్షించారు. వరంగల్ పర్యటనలో భాగంగా మొత్తం రూ.1,700 కోట్లతో చేపట్టిన పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు.కేటీఆర్ వెంట మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్, చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, నన్నపునేని నరేందర్, చల్లా ధర్మారెడ్డి, టీ రాజయ్య ఉన్నారు