ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతి భవన్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఉద్యోగ నియామకాలు, కృష్ణ జలాల వివాదం, తదితర అంశాలు ప్రధాన ఎజెండాగా చర్చకు రానున్నాయి. త్వరలో 50వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్.. అందుకు సంబంధించిన ఖాళీలను పరిశీలించనున్నారు. ఈ మేరకు అధికారులు సమగ్రమైన నోట్ రూపొందించి నేడు ముఖ్యమంత్రికి అందజేయనున్నారు. ఉద్యోగాల భర్తీ విషయంలో పాటించాల్సిన విధి విధానాలను ఈరోజు క్యాబినేట్ మీట్ లో ఫైనల్ చేస్తారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా నదిపై అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులపై సమావేశంలో ముఖ్యంగా చర్చ జరుగనున్నది. సీమ ఎత్తిపోతలను అడ్డుకునేందుకు ఎలాంటి ఎత్తుగడలు అనుసరించాలన్న అంశంపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనున్నది. కరోనా వల్ల ఆర్థిక దెబ్బతిన్న వనరులను తిరిగి ఎలా నిలుపుకోవాలి, ఆదాయాన్ని పెంచడం కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చ జరుగనున్నది.
భూముల విలువను సవరించాలనే అంశంపై క్యాబినెట్ లో ప్రస్తావనకు రానున్నది. కరోనా థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కోడానికి ఎంతవరకు సిద్ధంగా ఉన్నామన్న విషయాన్ని సీఎం అధికారులు, మంత్రులతో చర్చిస్తారు. వానాకాలం సీజన్ పూర్తిగా ప్రారంభం కావడంతో విత్తనాలు, ఎరువుల కొరత, లభ్యత, కల్తీ విత్తనాల నిరోధం వంటి వివిధ అంశాలపై పలు నిర్ణయాలు ప్రకటిస్తారు. జులై 1 నుంచి 10 వరకు జరిగిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో సీఎం సమీక్షిస్తారు.