తన దత్తత గ్రామమైన కీసరలో సమస్యల పరిష్కారానికి మొదటి విడతగా రూ.6 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు ఎంపీ శ్రీ జోగినపల్లి సంతోష్ కుమార్ గారు తెలిపారు. ఈనెల 1 నుంచి 10వరకు కీసర గ్రామంలో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ సంతోష్కుమార్ కీసర గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి విధితమే.
అదే సమయంలో గ్రామాభివృద్ధికి ఎన్ని నిధులైనా వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నానని, గ్రామంలో నెలకొన్న సమస్యలకు సంబంధించిన ప్రతిపాదనలు తన దృష్టికి తీసుకురావాలని గ్రామ సర్పంచ్కు సూచించారు. ఈ మేరకు శుక్రవారం సర్పంచ్ నాయకపు మాధురి వెంకటేశ్, స్థానిక టీఆర్ఎస్ నేత కన్నబోయిన రమేశ్లతో కలిసి ప్రగతిభవన్లో సంతోష్కుమార్ను కలిశారు.
కీసర బస్టాండ్లో షాపింగ్ కాంప్లెక్స్, విద్యుత్ స్తంభాలు, భూగర్భ డ్రైనేజీ, సీసీ రోడ్లు, ఎస్సీ కమ్యూనిటీ హాల్ సుందరీకరణ, అనుబంధ గ్రామాల్లో వైకుంఠ ధామాలు తదితర వాటికి సంబంధించి రూ.27కోట్ల ప్రతిపాదనలను అందించారు. దీంతో వెంటనే స్పందించిన ఎంపీ మొదటి విడతలో రూ.6కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. విడతల వారీగా నిధులు కేటాయిస్తానని, గ్రామంలో సమస్యలనేవి లేకుండా తీర్చిదిద్దాలని సూచించారు.