తెలంగాణ రాష్ట్రంలోని దళితులను అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం రూపొందించిన దళిత బంధు పథకంపై దళిత వర్గాలు, ప్రజా, కుల సంఘాలే కాకుండా ప్రతిపక్ష నేతలు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ పథకం బాగున్నదని ఇప్పటికే సీపీఐ, సీపీఎం ప్రశంసించగా, తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ టీ జీవన్రెడ్డి ఈ పథకాన్ని స్వాగతించారు.
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఒకసారి మాట అన్నారంటే ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి వెళ్లరని, ఆ మాటకు కార్యరూపం ఇచ్చే విషయాన్ని ఆలోచించుకొనే మాట్లాడుతారని కొనియాడారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దళిత బంధు పథకం కింద అర్హులైన ఒక్కో దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వటం సంతోషకరమని పేర్కొన్నారు. దళితుల్లోని ప్రధాన వర్గాలైన మాల, మాదిగలకు ఒక్కోటి, ఉపకులాలకు ఒకటి కలిపి ఎస్సీలకు మూడు మంత్రి పదవులు ఇవ్వాలని సీఎంకు సూచించారు. డబుల్ బెడ్రూం ఇండ్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ తదితర పథకాలపై పలు సూచనలు చేశారు.