తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2018 వానకాలంలో ప్రారంభించిన రైతుబంధు ద్వారా ఈ యాసంగి దాకా నాలుగేండ్లలో 8 సీజన్లకు రైతాంగానికి రూ.50,682.30 కోట్లు పంట పెట్టుబడిగా ఇచ్చింది. ప్రస్తుతం 8వ విడత సొమ్ము రైతుల ఖాతాల్లో జమ అవుతున్నది. ఈ సీజన్లో గత నెల 28న ప్రారంభమైన రైతుబంధు పంపిణీ ఈ నెల 10 వరకు కొనసాగుతుంది.సోమవారం నుంచి ఈ నెల 10 వరకు రాష్ట్రవ్యాప్తంగా రైతుబంధు వారోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీశాఖల మంత్రి కే తారకరామారావు పిలుపునిచ్చారు.
పథకం ప్రారంభమైనప్పటి నుంచి పంట పెట్టుబడి కోసం రైతుల బ్యాంకు ఖాతాల్లో వేస్తున్న డబ్బు ఈ నెల పదో తేదీనాటికి రూ.50 వేల కోట్లకు చేరనున్నదని వెల్లడించారు. 75 ఏండ్ల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రిగానీ ప్రధానమంత్రిగానీ ఎన్నడూ ఆలోచించని స్థాయిలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తీసుకొన్న గొప్ప కార్యక్రమం రైతుబంధు అని పేర్కొన్నారు. ఆదివారం వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డితో కలిసి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్పర్సన్లు, రైతుబంధుసమితి జిల్లా అధ్యక్షులు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్పర్సన్లతో ఆయన టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
రైతుబంధు ప్రారంభమైనప్పటి నుంచి రైతులు సంతోషంగా ఉన్నారని చెప్పారు. రాష్ట్ర వ్యవసాయ రంగానికి ఈ పథకం గొప్ప ఊతంగా మారిందని పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడ కూడా రైతుబంధు తరహా పథకాలతో ప్రభుత్వాలు రైతులను ఆదుకొన్న దాఖలాలు లేవని, ఆ ఘనత తెలంగాణ రాష్ర్టానికే సొంతమని వెల్లడించారు. ఈ అరుదైన సందర్భాన్ని పురస్కరించుకొని అంబరాన్నంటేలా సంబురాలు నిర్వహించి, ప్రతిఒక్కరికీ రైతుబంధు ప్రత్యేకత అర్థమయ్యేలా చెప్పాలని సూచించారు. రాష్ట్రంలోని పల్లెలన్నింటిలో 10వ తేదీవరకు పండుగ వాతావరణం నెలకొనేలా కార్యాచరణ ఉండాలని స్పష్టంచేశారు. అదే సమయంలో కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు.