టీమిండియాకి చెందిన డేరింగ్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ .. వికెట్ కీపర్ రిషభ్ పంత్ అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లండ్ తో ఆదివారం ముగిసిన నిర్ణయాత్మక మూడో వన్డేలో సెంచరీ చేసి భారత విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచులో పంత్ సెంచరీ చేయడం ద్వారా ఇంగ్లండ్ లో టెస్టులతో పాటు వన్డే ఫార్మాట్ లో కూడా సెంచరీ చేసిన తొలి ఆసియా వికెట్ కీపర్ బ్యాటర్ గా అరుదైన గుర్తింపు దక్కించుకున్నాడు.
ఇంగ్లండ్ తో కొద్దిరోజుల క్రితమే ముగిసిన రీషెడ్యూల్డ్ టెస్టులో పంత్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. 90 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయిన దశలో రవీంద్ర జడేజా తో కలిసి రెండు వందలకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు పంత్.
ఇక ఆదివారం నాటి వన్డేలో కూడా 72 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో హార్ధిక్ పాండ్యాతో కలిసి 133 పరుగులు జోడించాడు. ఫలితంగా భారత్ మ్యాచ్ తో పాటు సిరీస్ ను కూడా చేజిక్కించుకుంది. ఈ రెండు సందర్భాలలో భారత్ కు అవసరమున్న సమయంలోనే పంత్ సెంచరీలతో చెలరేగడం విశేషం.