విశాఖపట్నంలో అదృశ్యమైందని భావించిన వివాహిత సాయి ప్రియ మిస్సింగ్ కేసులో సూపర్ ట్విస్ట్. రెండో పెళ్లిరోజు సందర్భంగా భర్త శ్రీనివాసరావుతో ఆర్కే బీచ్కు వెళ్లిన సాయి ప్రియ.. తన భర్త ఫోన్లో బిజీగా ఉండగా ప్రియుడితో చెక్కేసింది. నెల్లూరుకు చెందిన రవి అనే యువకుడితో అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం.
రెండు రోజుల క్రితం సాయి ప్రియ ఆచూకీ తెలియకపోవడంతో భర్త వైజాగ్ త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. సాయి ప్రియ గల్లంతయి ఉండొచ్చని భావించారు. ఎంత గాలించిన ఫలితం లేకపోవడంతో నేవీ హెలికాప్టర్ను రంగంలోకి దించారు. హెలికాప్టర్ ఎంత గాలించినా ఉపయోగం లేకపోయింది. అయితే ఈ మధ్యాహ్నానికి సాయి ప్రియ ఓ యువకుడితో నెల్లూరులో ఉన్నట్లు గుర్తించారు.
పెళ్లికి ముందు నుంచే రవితో ఆమె ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. కుటుంబసభ్యుల ఒత్తిడితో 2020 జులై 25న శ్రీనివాసను ఆమె పెళ్లాడింది. అప్పటి నుంచి తరచూ రవితో మాట్లాడుతూ ఉన్న సాయి ప్రియ.. ఈనెల 25న భర్త కళ్లు గప్పి ప్రియుడితో పరారైంది. ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు హెలికాప్టర్ సాయంతో సాయి ప్రియ ఆచూకీ కోసం అధికార యంత్రాంగం సుమారు రూ.కోటి ఖర్చుచేసినట్లు తెలిసింది.