ఇండియా-ఆస్ట్రేలియా మధ్య హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో రేపు టీ20 మ్యాచ్ జరగనుంది. మ్యాచ్ చూసేందుకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో రైలు అధికారులు సమాయాన్ని పొడిగించారు. ఉప్పల్, ఎన్జీఆర్ఐ, స్టేడియం మెట్రో స్టేషన్ల నుంచి చివరి రైలు రాత్రి ఒంటిగంటకు వెళ్తుందని తెలిపారు. ఈ నేపథ్యంలో క్రికెట్ అభిమానులకు కొన్ని సూచనలు చేశారు.
చివరి రైలు ఎక్కేందుకు ఉప్పల్, ఎన్జీఆర్ఐ, స్టేడియం స్టేషన్ల నుంచి మాత్రమే అనుమతిస్తారు. మిగిలిన స్టేషన్లలో దిగేందుకు మాత్రమే అనుమతి ఉంటుంది. అందుకే మ్యాచ్ చూసేందుకు వెళ్లేవారు మెట్రో స్టేషన్లోనే రిటర్న్ టికెట్ కూడా తీసుకోవాలని సూచించారు. దీని వల్ల క్యూలో నిలబడకుండా ఉండేందుకు చివరి రైలు గడువు సమయం కంటే ముందు దాన్ని అందుకునేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు.
స్మార్ట్ కార్డులు ఉపయోగించాలని సూచించారు. రాత్రి 10.15 గంటల తర్వాత డిజిటల్ టికెట్లను విక్రయించరు. రాత్రి 10.15 గంటలలోపు తీసుకునే టికెట్లు ఉప్పల్, ఎన్జీఆర్ఐ, స్టేడియం మెట్రో స్టేషన్ల వద్ద మాత్రమే అనుమతిస్తారు. అందుకే అధికారులకు ప్రయాణికులు సహకరించాలని కోరారు.