Minister Roja : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని మంత్రి రోజా హెచ్చరించారు. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ… రోడ్డుపై రౌడీలు రోడ్ షోలు చేయడం ఏంటీ ? అని రోజా ప్రశ్నించారు. పవన్ కు దమ్ముంటే జనసేన నుంచి 170 మందిని పోటీకి దింపాలని సవాలు విసిరారు. మన జీవితాలను మార్చేవారికి, అభివృద్ధి పనులు చేసేవారికే జనాలు ఓట్లు వేస్తారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ఎడమ కాలి వెంట్రుకను కూడా ఎవరూ పీకలేరని రోజా వ్యాఖ్యానించారు. పిచ్చిపిచ్చిగా మాట్లాడేవారికి జనాలు ఓట్లు వేయరని అన్నారు.
ఏపీలోని ఇప్పటంలో కూల్చివేతలు జరుగుతున్న నేపథ్యంలో ఆ ప్రాంత ప్రజలతో పవన్ కల్యాణ్ మాట్లాడి, ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన అంశంపై రోజా స్పందించారు. గత ఎన్నికల్లో పవన్ రెండు నియోజక వర్గాల నుంచి పోటీ చేస్తే, ఆ రెండు చోట్లా ఆయనను ప్రజలు ఓడించారని రోజా చెప్పారు. ఇప్పటంలో కూల్చివేతల విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తున్నారని చెప్పారు. బాధ్యత లేకుండా, పద్ధతి లేకుండా వ్యవహరించే వారిని ప్రజలు ఎలా ఆదరిస్తారని ఆమె నిలదీశారు. కాగా, వైసీపీపై విమర్శలు చేసిన పవన్ పై వైసీపీ నేతలు వరుసగా ఫైర్ అవుతున్నారు.
కాగా ఈరోజు మీడియా సమావేశం నిర్వహించిన పవన్ వైకాపాపై తీవ్ర విమర్శలు చేశారు. 175 స్థానాల్లో గెలుస్తామని వైసీసీ విర్రవీగుతోంది. ఎలా గెలుస్తారో నేను చూస్తా. ఆంధ్రా లోనే పుట్టాను. ఆంధ్రాలోనే తేల్చుకుంటాను. ఇప్పటి వరకు చేసిన బానిసతనం చాలు. ఇప్పటం కూల్చివేతలన్నీ అధికార పార్టీ కూల్చివేతలే. పథకాలకు జగనన్న విద్యా దీవెన అని పేరు ఎందుకు పెడతారు? గుర్రం జాషువా అని ఎందుకు పెట్టరు? పింగళి వెంకయ్య అని క్యాంటీన్ నామకరణం చేయలేరా? అంటూ పవన్ మాట్లాడారు.