Minister Talasani : టీఆర్ఎస్ బలమైన రాజకీయ పార్టీ అని, ఎవరి తాటాకు చప్పుళ్లకు టీఆర్ఎస్ భయపడదు అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్లో ఆదివారం ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో మంత్రి తలసాని పాల్గొన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ… ఇటీవల జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో కేంద్ర మంత్రులు, ఎంతో మంది బీజేపీ నేతలు గద్దల్లా తిరిగారని.. ఇప్పుడు అక్కడ ఒక్క బీజేపీ నేత కన్నెత్తి చూడటం లేదన్నారు. కేవలం ఒక్క టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు మాత్రమే మునుగోడులు తిరుగుతున్నారని మంత్రి తలసాని తెలిపారు.
హైదరాబాద్ టీఆర్ఎస్ కి అడ్డాగా మారిందని, ఇక ఎన్ని రాజకీయ పార్టీలు వచ్చినా గులాబీ దళాన్ని ఏమీ చేయలేరని అన్నారు. గత 8 ఏళ్ల పాలనలో సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని మంత్రి తలసాని చెప్పారు. 125 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ అంతరించిపోతోందని, ప్రస్తుతం దానికి అతీగతీ లేదని ఎద్దేవా చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ నీటి మీద గాలి బుడగ లాంటిందని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ తాటాకు చప్పుళ్లకు భయపడే పార్టీ టీఆర్ఎస్ కాదన్నారు.
రాజకీయంగా ఎదుర్కోలేక టీఆర్ఎస్ నేతలను మంత్రులు, ఎమ్మెల్యేలను కేంద్రం ఇబ్బందులు పెడుతోందని మంత్రి తలసాని ఆరోపించారు. రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి నివాసం, ఆస్తులపై, ఆయన బంధువుల ఇళ్లల్లో ఐటీ అధికారులు దాడులు సమయంలో చాలా అనైతికంగా ప్రవర్తించారని ఆయన మండిపడ్డారు. దర్యాప్తు సంస్థలను కేంద్రంలోని బీజేపీ తమ కక్ష సాధింపు చర్యలకు వాడుకుని దుర్వినియోగం చేస్తుందని విమర్శించారు.