ANAM VIJAYKUMAR: నెల్లూరు ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రవర్తనపై వైకాపా నేత ఆనం విజయ్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కోటం రెడ్డి….అనవసరంగా రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు.
పార్టీ నుంచి వెళ్లిపోవాలని కోటంరెడ్డితో ఎవరూ అనలేదని వ్యఖ్యానించారు. గుండాలతో దందాలు చేసే వ్యక్తి కోటంరెడ్డి అని ధ్వజమెత్తారు. అల్లర్లు సృష్టించి రాజకీయాలు చేసే స్థాయికి దిగజారిపోయారని మండిపడ్డారు.
ఫోన్ ట్యాపింగ్ చేయడానికి సీఎం జగన్ ఏం అవసరమని ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేశ్ ను కలవడం నిజంకాదా? కోటంరెడ్డి సోదరులు తినే ప్రతి మెతుకు మీద సీఎం జగన్ పేరుందని ధ్వజమెత్తారు. అధిష్టానం దృష్టిలో పడితేనే ఎమ్మెల్యే అవుతారని ఉద్ఘాటించారు. పార్టీలో గుర్తింపు లేదని చెప్పడం సమంజసం కాదు.
తెదేపాతో కుమ్మక్కై దారి చూపిన జగన్ పై ఆరోపణలు చేయడం న్యాయం కాదని దుయ్యబట్టారు.
ఆనం రామనారాయణరెడ్డి కూడా ఎందుకు పార్టీకి దూరమయ్యారో తెలియడం లేదని వ్యాఖ్యానించారు. శ్రుతిమించితే ఎవరికైనా చర్యలు తప్పవని ఆక్షేపించారు.