పార్లమెంట్లో అవిశ్వాసంపై చర్చ జరిగే కీలక సమయంలో సభకు వచ్చేది లేదని షాక్ ఇచ్చిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్రెడ్డి మరో ఝలక్ ఇచ్చారు. ఇవాళ తన ఎంపీ పదవితోపాటు.. టీడీపీకి రాజీనామా చేస్తానని ప్రకటించారు. అయితే, ఇవాళ జరగనున్న పార్లమెంట్ సమావేశంలో పాల్గొంటానన్న జేసీ.. అవిశ్వాసంపై జరిగే చర్చలో, ఆ తరువాత జరిగే ఓటింగ్లో పాల్గొన్న అనంతరం టీడీపీకి, ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నట్టు స్పష్టం చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి ఇచ్చినంత ప్రాధాన్యత తనకు ఇవ్వడం లేదని ఎంపీ జేసీ దివాకర్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
మరో పక్క అవిశ్వాస తీర్మానం టీడీపీలో ప్రకంపనలు రేపుతోంది. ఆ పార్టీకి చెందిన ఎంపీలందరిలోనూ అసంతృప్తిని నింపుతోంది. అవిశ్వాసంపై టీడీపీ తరుపున మాట్లాడేందుకు పార్లమెంట్ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఇద్దరికి అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ చర్చలో పాల్గొనాలని గుంటూరు ఎంపీ గల్ల జయదేవ్, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడును చంద్రబాబు నాయుడు ఆదేశించినట్టు తెలుస్తోంది. ఇది విజయవాడ ఎంపీలు కేశినేని నాని, తోట నర్సింహంకు తీవ్ర అసంతృప్తికి గురి చేసింది. అవిశ్వాస నోటీసు ఇచ్చిన తనకు చంద్రబాబు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోవడం తనను చాలా బాధకు గురి చేసిందని ఎంపీ కేశినేని తన సహచరులతో అన్నట్టు సమాచారం.