ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అత్యంత దుర్మార్గంగా, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి విమర్శించారు. చంద్రగిరి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డిపై అలాగే వైసీపీ కార్యకర్తలపై టీడీపీ ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతుందని ఆయన ధ్వజమెత్తారు. తమపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారని, చెవిరెడ్డిని భౌతికంగా అంతమొందించడానికి కూడా కుట్రలు చేస్తున్నారని ఆగ్రహించారు. ఒక ఎమ్మెల్యే అయిన చెవిరెడ్డి భాస్కర్రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేసి రాత్రి అంతా పోలీసు వ్యాన్లో తిప్పుతూ సత్యవేడు పోలీస్స్టేషన్లో పెట్టడం చాలా దారుణమన్నారు.
చంద్రబాబు ఉన్మాదచర్యలకు పాల్పడుతున్నారని, ఘటనను ప్రజాస్వామ్యవాదులంతా తీవ్రంగా ఖండించాలన్నారు. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని పార్టీ నేతలు ధ్వజమెత్తారు. దీనిని ఖండిచాల్సిన అధికారులు కూడా కూడా టీడీపీ నేతలకు వత్తాసు పలుకుతున్నారని, వైసీపీ ఎమ్మెల్యే, కార్యకర్తలను అరెస్ట్ చేసి అర్ధరాత్రులు తిప్పడం బాధాకరమన్నారు. చంద్రబాబు ద్వంద వైఖరికి వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధిచెబుతారన్నారు. జిల్లాలో ఉన్నతాధికారులు కూడా చంద్రబాబుకు తొత్తులుగా పనిచేస్తున్నారన్నారని విమర్శించారు.