మన రాష్ట్రాన్ని ఓ దొంగ, రాక్షసుడు, నేరగాడు పాలిస్తున్నాడని ఆ దొంగను ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లోమీడియా మోస్తుందని వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. తొమ్మిదేళ్లుగా తనకు అండగా నిలిచిన పార్టీ శ్రేణులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికీ అందాలని రేపటి పాలనకు బూత్ కమిటీ సభ్యులే దిక్కూచిగా నిలబడతారన్నారు. ప్రతీ కార్యకర్తకు తోడుగా ఉంటానని హామీ ఇచ్చారు. మంగళవారం నెల్లూరు ఎస్వీజీఎస్ కాలేజీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమర శంఖారావం సభలో జగన్ పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. మీపై పెట్టిన దొంగ కేసుల గురించి నాకు తెలుసు. ప్రతి బూత్ కమిటీ సభ్యుడికి నేను చెబుతున్నా అధికారంలోకి వచ్చిన వెంటనే దొంగ కేసులన్నీ ఎత్తేస్తామన్నారు.
దేవుడు ఆశీర్వదించి ప్రజలందరి చల్లని దీవెనలతో మన పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కులాలు చూడకూడదు, మతాలు చూడకూడదు, రాజకీయాలు చూడకూడదు. చివరకు పార్టీలు కూడా చూడొద్దు. ప్రతి పేదవాడికి సంక్షేమాలు అందించే విషయంలో మీరే ముందుంటారన్నారు. అలాగే సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.. ఒక దొంగ మన రాష్ట్రాన్ని పాలిస్తున్నాడు. ఒక రాక్షసుడు మన రాష్ట్రాన్ని పాలిస్తున్నాడు. ఒక నేరగాడు మన రాష్ట్రాన్ని పాలిస్తున్న అన్యాయ పరిస్థితుల్లో రాష్ట్రం ఉందన్నారు. ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీ చేస్తూనే నిసిగ్గుగా బుకాయిస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యాన్ని మనం రక్షించుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. ఇటువంటి సమయంలో కూడా చంద్రబాబును ఎల్లో మీడియా మోస్తుందన్నారు.