తెలుగుదేశం పార్టీ మందలగిరి అభ్యర్ధి నారా లోకేశ్ కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. తాడేపల్లి పట్టణ, మండల పరిధిలో టీడీపీ నేతలు గత నాలుగైదు సంవత్సరాల నుంచి ఆ పార్టీలో పనిచేసే వారినే మళ్లీ పార్టీలో చేర్చుకుంటున్నారు. కొత్త కండువాలు కప్పి ఫొటోలకు ఫోజులిస్తున్నారు. లోకేశ్ సమక్షంలో ఆయన నివాసం వద్ద టీడీపీలో చేరినవారంతా ఎంతోకాలంగా ఆ పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలే. సైకం మురళి, మల్లి తదితరులు పార్టీ పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర వర్గానికి చెందిన వారే అయినా మళ్లీ వైసీపీ నుంచి చేరినట్లు చెబుతున్నారు. అలాగే మల్లికార్జునరావుకు వైసీపీలో కనీసం పార్టీ సభ్యత్వం లేదని వివరించారు. కొన్ని ప్రాంతాల్లో వివిధ పార్టీల నుంచి టీడీపీలోకి భారీగా వలస వచ్చారని లోకేష్ వద్ద చెబుతున్నా వీరంతా తాడేపల్లి జెడ్పీటీసీ శైలజారాణి, మాజీ ఎంపీటీసీ, టీడీపీలోంచి సస్పెండ్ అయిన బీసీ నాయకుడు నూతక్కి ఏడుకొండలు ఆధ్వర్యంలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న వారేనట… ఎప్పటినుంచో ఉన్న టీడీపీ కార్యకర్తలనే వివిధ పార్టీలనుంచి వచ్చి టీడీపీలో చేరారని స్థానిక నేతలు ప్రచారం చేయడం వారికి లోకేశ్ పరవశించి పార్టీ కండువాలు కప్పి ఫొటోలు దిగడం పలు విమర్శలకు తావిస్తోంది.
