తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకుడు, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ తనకు తానే రాయితో కొట్టుకున్నాడని, వీడియోలో స్పష్టంగా కనబడుతున్నదని పశ్చిమ మండల డీసీపీ శ్రీనివాస్ స్పష్టం చేశారు. గోషామహల్ నియోజకవర్గ పరిధిలోని జుమ్మెరాత్ బజార్లో నిన్న రాత్రి స్వాతంత్య్ర సమరయోధురాలు రాణి అవంతి బాయ్ లోథ్ విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు కొందరు యువకులు ప్రయత్నించారని డీసీపీ తెలిపారు.
దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని విగ్రహా ప్రతిష్టాపనను అడ్డుకున్నారు. ఈ సమయంలోనే రాజాసింగ్ అక్కడికి చేరుకుని యువకులకు మద్దతుగా ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యువకులను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్న క్రమంలో.. రాజాసింగ్ తనకు తానే ఓ పెద్ద రాయితో తలపై కొట్టుకున్నాడని డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు.
ఈ దృశ్యాలు వీడియోలో స్పష్టంగా కనబడుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. పోలీసులు యువకులపై లాఠీఛార్జ్ చేయలేదని చెప్పారు. అనుమతి లేకుండా విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసేందుకు ప్రయత్నించడంతోనే పోలీసులు యువకులను అడ్డుకున్నారని డీసీపీ పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారని తెలిపారు.