నవ్యాంధ్ర ప్రతిపక్ష పార్టీ టీడీపీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు,ఎంపీలు,ఎమ్మెల్యేలు ఆ పార్టీకి గుడ్ బై చెబుతోన్న సంగతి విదితమే. ఈ క్రమంలో ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఒకరు టీడీపీకి రాజీనామా చేశారు. అప్పటి ఉమ్మడి ఏపీలో 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గం నుండి టీడీపీ తరపున బరిలోకి దిగి గెలుపొందిన ఎమ్మెల్యే హేమలత ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. నవ్యాంధ్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఆధ్వర్యంలో ఆమె బీజేపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీడీపీలో కష్టపడిన నిఖార్సైన నేతలకు,కార్యకర్తలకు తగిన ప్రాధాన్యత లేదు. గత ఎన్నికల్లో ప్రజలు నమ్మి ఓట్లేశి గెలిపిస్తే ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేశారు. దీంతో ప్రజలు తిరస్కరించారు. ఎన్ని సార్లు మొరపెట్టుకున్న కానీ చంద్రబాబు మాట వినలేదు. ఒంటెద్దు పోకడతో పార్టీని సర్వనాశనం చేశారు. నవ్యాంధ్రలో టీడీపీకి భవిష్యత్తులేదు. అందుకే బీజేపీలో చేరుతున్నట్లు ఆమె ప్రకటించారు.
