దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయంలో బందరుపోర్టు శంకుస్థాపన జరిగిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ గుర్తు చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో బందర్ పోర్టు నిర్మాణం పై చర్చ జరిగింది. ఈసందర్భంగా జోగి రమేశ్ మాట్లాడుతూ.. బందరు పోర్టు నిర్మించి వేలమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని వైఎస్సార్ ఆలోచన చేశారు. ఈ పోర్టుకు దశాబ్దాల చరిత్రఉంది. కానీ టీడీపీ అధికారంలోకి వచ్చాక బందరు పోర్టుపై మాట నిలబెట్టుకోలేదు. పోర్టు నిర్మాణానికి 28 గ్రామాల్లో 33వేల ఎకరాలు కావాలని నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే ఓడరేవు నిర్మాణానికి ఇన్ని ఎకరాలు ఎందుకని ప్రజలనుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది.
నాటి ప్రతిపక్షనేత జగన్మోహన్రెడ్డి కూడా బాధిత గ్రామాల తరఫున పోరాటం చేశారు. దీంతో స్పందించిన చంద్రబాబు ఆ సేకరణ నోటిఫికేషన్ రద్దు చేస్తామని చెప్పింది. అయితే ఎన్నికలకు మూడునెలల ముందు బందరు పోర్టు నిర్మాణం జరిగిపోయిందనే రీతిలో హడావుడి చేసింది. తీరా చూస్తే ట్రాలీలో ఓడ తెచ్చి పరిసర గ్రామాల్లో ఊరేగించారని తెలిపారు. చంద్రబాబు సర్కార్ తీసుకువచ్చిన బలవంతపు భూసేకరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని రమేశ్ ప్రభుత్వాన్ని కోరారు. సాధ్యమైనంత త్వరలో బందరు పోర్టు నిర్మాణాన్ని చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు అవసరానికి మించి భూ సేకరణ చేపట్టారని మండిపడ్డారు. పైగా ఎన్నికలకు ముందు రూ. 10కోట్లు ఖర్చు పెట్టి పోర్టు నిర్మాణం జరుగుతుందనే రీతి లో ఆర్భాటం చేశారని విమర్శించారు.