‘అతడు’ అమ్మాయిల కలల ‘రాజకుమారుడు’. అబ్బాయిలకు ‘బిజినెస్మెన్’లా రోల్మోడల్. కుటుంబ కథా చిత్రాల ప్రేక్షకులకు కృష్ణ ముకుంద ‘మురారి’. బాక్సాఫీస్ వద్ద కాసులను కొల్లగొట్టే ‘టక్కరి దొంగ’. ‘సైనికుడు’లా ‘దూకుడు’ ప్రదర్శిస్తూ.. తనలోని ‘ఖలేజా’ ఎంటో ‘ఒక్కడు’గా వచ్చి చూపించగలడు. ‘పోకిరి’లా అలరించినా ‘నాని’లా నవ్వించినా ఒక్కటి మాత్రం ‘నిజం’.. ‘అతిథి’లా వచ్చి నిర్మాతల పాలిట కాసులను కురిపించే ‘శ్రీమంతుడు’. ఆయనే నెంబర్ ‘1’ కథానాయకుడు మహేష్బాబు. సినిమా కోసం తపన పడి తపస్సు చేసే రుషులలో అతడో ‘మహర్షి’. శుక్రవారం ఆయన పుట్టిన రోజు సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలు…
1975 ఆగస్టు 9న పుట్టిన మహేశ్బాబు నాలుగేళ్ల వయసులో దాసరి నారాయణరావు దర్శకత్వంలో ‘నీడ’తో బాల నటుడిగా మారారు.
బాల నటుడిగా మొత్తం 9 సినిమాల్లో నటించారు. ‘నీడ’, ‘పోరాటం’, ‘శంఖారావం’, ‘బజారు రౌడీ’, ‘ముగ్గురు కొడుకులు’, ‘గూఢచారి 117’, ‘కొడుకు దిద్దిన కాపురం’, ‘అన్నాతమ్ముడు’, ‘బాలచంద్రుడు’ చిత్రాల్లో నటించి మెప్పించారు.
తండ్రి కృష్ణ సూచన మేరకు దాదాపు 9ఏళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉండి, చదువును పూర్తి చేశారు.
మహేశ్బాబు, హీరో కార్తీ చెన్నైలో ఒకే స్కూల్లో కలిసి చదువుకున్నారు.
మహేశ్బాబు కథానాయకుడిగా వెండితెరకు పరిచయం అయిన చిత్రం ‘రాజకుమారుడు’. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రీతిజింతా కథానాయిక. ఉత్తమ పరిచయ కథానాయకుడిగా నంది అవార్డును సొంత చేసుకున్నారు.
గుణశేఖర్ దర్శకత్వంలో 2003లో వచ్చిన ‘ఒక్కడు’ మహేశ్ కెరీర్లో భారీ విజయాన్ని అందుకున్న తొలి చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత ‘పోకిరి’ ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొడితే, ‘దూకుడు’ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది.

‘వంశీ’ చిత్రంలో తనతో కలిసి వెండితెర పంచుకున్న కథానాయిక నమ్రతను మహేశ్బాబు ప్రేమించి వివాహం చేసుకున్నారు.
టైమ్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ జాబితాలో బాలీవుడ్ నటులు షారుఖ్, సల్మాన్, ఆమీర్లను వెనక్కి నెట్టి మొదటి స్థానంలో నిలిచారు.
మహేశ్ బాబు ట్విటర్ను 8 మిలియన్ల మంది ఫాలో అవుతుండగా, ఆయన మాత్రం 25మందిని మాత్రమే ఫాలో అవుతున్నారు. ఇక ఫేస్బుక్ను 5 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు.
మహేశ్బాబు తన కెరీర్లో నాలుగు చిత్రాలకు వాయిస్ ఓవర్ ఇచ్చారు. అవి ‘జల్సా’, ‘బాద్షా’, ‘శ్రీశ్రీ’, ‘మనసుకు నచ్చింది’.
మహేశ్బాబు సినిమాలే కాదు.. సామాజిక సేవలోనూ ముందుంటారు. అనాథ పిల్లలకు సాయం చేయడం, గుండె జబ్బుతో బాధపడుతున్న చిన్నారులకు శస్త్రచికత్సలు చేయిస్తున్నారు.
‘శ్రీమంతుడు’తో నిర్మాతగా మారిన సూపర్స్టార్ ఆ తర్వాత ‘బ్రహ్మోత్సవం’ నిర్మించారు. ఇప్పుడు ‘సరిలేరు నీకెవ్వరూ’, ‘మేజర్: ది ఫిల్మ్’ (అడవిశేష్) చిత్రాలను నిర్మిస్తున్నారు.
మహేశ్బాబు వెండితెరపై అజయ్ అనే పేరు మూడుసార్లు పెట్టుకున్నారు. ‘ఒక్కడు’, ‘దూకుడు’ భారీ విజయాన్ని అందుకోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సరిలేరు నీకెవ్వరు’లో ‘అజయ్కృష్ణ’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. Source: Enadu