వనపర్తి జిల్లాలోని మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. గిట్టుబాటు ధర గురించి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని అన్నారు. నిబంధనలకు అనుగుణంగా పంటలను తీసుకొచ్చే బాధ్యత రైతులదన్నారు. ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం .. ప్రతి రైతు మోముపై చిరునవ్వే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం అన్నారు. ఒక్క తెలంగాణలోనే పండిన పంటలన్నీ మద్దతుధరకు కొంటున్నాం… పక్క రాష్ట్రాలలో ఈ పరిస్థితి లేదన్నారు. దీనిని అవకాశంగా తీసుకుని పక్క రాష్ట్రంలో తక్కువధరకు పంటలు కొని మనవద్ద దళారులు అమ్ముతున్నారని చెప్పారు. దీనిని అరికట్టేందుకు చెక్ పోస్ట్ లపై నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని… వ్యవసాయం చేస్తున్న రైతు లాభ పడాలన్నదే ప్రభుత్వ ఆశయం అన్నారు. పండిన పంటలలో కేంద్రం 25 నుండి 30 శాతమే మద్దతుధరకు కొనుగోలు చేస్తుందని… తెలంగాణ ప్రభుత్వం కేంద్రం నిర్ణయంతో సంబంధం లేకుండా 100 శాతం పంటలు మద్దతుధరకు కొనుగోలు చేయాలని నిర్ణయించిందన్నారు. మార్కెట్లో రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
