రాజధాని అంటే ఊరికి బొడ్డురాయా? చూసి చూసి సరిగ్గా మధ్యలో పెట్టడానికి. ప్రజలను హిప్నటైజ్ చేయడానికి, అమరావతే సరైన రాజధాని అని జనం మెదల్లోకి ఎక్కించడానికి చంద్రబాబు, మీడియా బినామీలు ఆడిన గొప్ప డ్రామా “అందరికీ సమానదూరంలో రాజధాని”. ఒక్కసారి వేరే రాష్ట్రాల్లో చూసుకుంటే..!
*తమిళనాడు రాజధాని చెన్నై రాష్ట్రానికి విసిరేసినట్టుగా చివర్లో ఉంటుంది.
*కర్ణాటక రాజధాని బెంగుళూరు కూడా చిట్టచివరన ఉంటుంది.
*కేరళ రాజధాని తిరువనంతపురం కూడా ఆ రాష్ట్రానికి చివరి జిల్లాలో ఉంటుంది.
*ముంబై, కోల్కతాలు కూడా ఆయారాష్ట్రాలకు విసిరేసినట్టుగా చిట్ట చివరన ఉంటాయి.
ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే అదేమైననా దేశానికి మధ్యలో ఉందా? రాష్ట్రానికి మధ్యలో రాజధాని ఉండాలనేది రాష్ట్రాన్ని ఇప్పటివరకూ బ్రష్టుపట్టించిన ఒక పెద్ద అపోహ. యావత్ దేశమే కాదు ప్రపంచములో కూడా రాజధానులు ఆయా ప్రాంతాలకు మధ్యలో లేవు. నాగరికత, రవాణాసదుపాయాలు, వ్యాపారవర్తకం, తాగునీరు సదుపాయం ఇటువంటి అంశాలను పరిగణలోకి తీసుకుని రాజధానులు వెలిశాయి. ఇప్పటికి ఇప్పుడు హైదరాబాద్ తో, తెలంగాణా రాష్ట్రంతో పోటీ పడాలంటే, హైదరాబాద్ లేని లోటును పూడ్చుకోవాలంటే విశాఖను రాజధాని చేయాలి. పొరుగు రాష్ట్రాలకు బెంగుళూరు, హైదరాబాద్, చెన్నై, ముంబైలా.. విశాఖపట్నం కచ్చితంగా మనకు ఒక గొప్ప ప్రైడ్. ఇప్పటికే విశాఖ గ్లోబల్ సిటీగా ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. విశాఖలో ఐటీ రంగం విస్తరిస్తోంది. హైదరాబాద్, బెంగుళూరులతో సమానంగా.. అంతకన్నా ఎక్కువగా రాజధానిగా ఎదిగేందుకు అక్కడి కల్చర్ , క్లైమేట్ కూడా సహకరిస్తుంది. రాజధాని మనకు దగ్గరలో ఉండాలనుకోవడం ఎవరికైనా సహజమే కానీ రాజధాని మార్పు విషయంలో ఒక్క సారి రాష్ట్ర బాగోగుల గురించి గుంటూరు, కృష్ణా జిల్లా ప్రజలు ఆలోచనచేయాలి. అమరావతినే రాజధానిగా పెట్టుకుని కూర్చుంటే పెట్టుబడులు పక్కరాష్ట్రాలకు పోతాయితప్ప రాష్ట్రానికి రాజధాని మధ్యలో ఉందని మనకు ఏమీ ఒరగదు.ఒకవేళ రాజధాని మారిస్తే భూములిచ్చిన రైతులు నష్టపోకుండా వారికి మంచి చేయాలి. విజయవాడ గుంటూరులను మూడుపంటలు పండే రైతురాజధానిగా, జంటనగరాలుగా, రైతు వాణిజ్య కేంద్రాలుగా తీర్చిదిద్దాలి.