యాంజీయోప్లాస్టీ చేయించుకున్న బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీని బుధవారం డిశ్చార్జ్ చేస్తామని ఉడ్ల్యాండ్ హాస్పిటల్ ఎండీ, సీఈవో డాక్టర్ రూపాలీ బసు తెలిపారు. 48 ఏళ్ల గంగూలీ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆమె చెప్పారు.
‘వైద్య పరంగా సౌరవ్ ఆరోగ్యం ఎంతో బాగుంది. హాయిగా నిద్రపోయాడు, అల్పాహారం తీసుకొన్నాడు. మాతో కూడా మాట్లాడాడు. ఎంతో అనుభవజ్ఞులైన 15 మంది డాక్టర్ల బృందం గంగూలీ డిశ్చార్జ్పై నిర్ణయం తీసుకొంద’ని రూపాలీ మీడియాకు తెలిపారు.
తదుపరి చికిత్సపై మరో రెండు వారాల తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఆమె చెప్పారు. స్వల్ప గుండె పోటు రావడంతో గంగూలీని గత శనివారం ఆసుపత్రిలో చేర్చారు. ‘గంగూలీ మళ్లీ క్రికెట్ ఆడొచ్చు.. మారథాన్లో కూడా పాల్గొనవచ్చు. అతడి గుండె ఎంతో బలంగా ఉంది. తదుపరి చికిత్స అంటే.. మందులతోనే నయం చేసుకోవాలా? లేక మరోసారి యాంజియో చేసుకోవాలా? అనే నిర్ణయం అతడిదేన’ని హృద్రోగ నిపుణుడు దేవి షెట్టి పేర్కొన్నారు.